ఘోరం: యువతిని తీసుకెళ్లాడని.. అతని తల్లిపై గ్యాంగ్రేప్
ముజఫర్నగర్: ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో.. ఆ యువతి కుటుంబసభ్యులు.. ఆ యువకుడి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్లోని భోపురా గ్రామానికి చెందిన ఓ యువకుడు ముజఫర్నగర్కు చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో నవంబర్ 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
అయితే ఈ విషయమై యువతి కుటుంబసభ్యులు యువకుడిపై కక్ష పెంచుకున్నారు. డిసెంబర్ 19న యువకుడి తల్లిదండ్రులతో పాటు సోదరుడు, బావను కిడ్నాప్ చేశారు. అనంతరం షామ్లీ ప్రాంతంలోని ఓ ఇంట్లో వారిని బంధించి హింసించారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు.. యువకుడి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం అందగానే.. వారు ఆ ఇంటిపై దాడి చేసి బాధితులను రక్షించారు. దీంతో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో యువతి తండ్రి, ఇద్దరు సోదరులు, మాజీ సర్పంచిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.