అసెంబ్లీ ఎన్నికలు ముందు బీఎస్పీకి షాక్: లేజిస్లేచర్ పార్టీ నేత, ఎమ్మెల్యే రాజీనామా
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ జరుగనున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ)కి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ లేజిస్లేటివ్ పార్టీ నేత, ఎమ్మెల్యే షా ఆలం పార్టీకి రాజీనామా చేశారు. తన పనితీరు పట్ల పార్టీ అధినేత్రి మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ క్రమంలోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ముబారక్పూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షా ఆలం తెలిపారు.
అయితే, రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాను ప్రస్తుతం మానసికంగా వ్యాకులత చెందానని, తాను ఇప్పుడే ఏ పార్టీలో చేరే విషయంపై ఆలోచించలేదని షా ఆలం తెలిపారు. తాను కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.
తాను బీఎస్పీ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్లు షా ఆలం తెలిపారు. పార్టీ అధినేత్రి మాయావతికి, తనకు మధ్య నమ్మకం లేకుండా పోయిందని అన్నారు. తమ నాయకులు తమను విశ్వసించనప్పుడు తాము ఆ పార్టీలో ఉండటం సరికాదని రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు బీఎస్పీ అధినేత్రి మాయావతికి షా ఆలం లేఖ రాశారు. 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు తనకు ముబారక్పూర్ నుంచి ఎమ్మెల్యేగా మీరు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నేను విజయం సాధించాను. 2012 నుంచి నుంచి తాను పార్టీకి ఎంతో అంకితభావంతో పనిచేశాను, ఏ పని అప్పగించినా బాధ్యత చేశాను. అయితే, నవంబర్ 21న మీతో సమావేశం అయిన తర్వాత నా పని పట్ల మీరు సంతృప్తి చెందలేదని తెలిసింది. నేను ఎంతో నమ్మకంగా పనిచేశాను నాకు గుర్తింపు లభించలేదని తెలిసింది అని లేఖలో షా ఆలం వ్యాఖ్యానించారు.
Recommended Video
ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే పదవికి, బీఎస్పీ లేజిస్టేచర్ పార్టీ లీడర్ పదవికి రాజీనామా చేశానని షా ఆలం తెలిపారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఈ ఏడాది మొదట్టోనే బీఎస్పీ నేత లాల్జీ వర్మను పార్టీ అధిష్టానం బహిష్కరించింది.