ఎక్కడ చూసినా నేనే: యూపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై తేల్చేసిన ప్రియాంక గాంధీ వాద్రా
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించాయి.
Recommended Video

యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై తేల్చేసిన ప్రియాంక గాంధీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం పార్టీ యూత్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ.. 'ఇంకెవరైనా ఉన్నారా? మరి ఇంకేంటీ? ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నానుగా.. చూడట్లేదా? ' అని ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. దీంతో కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రియాంకనే అనే విషయం ఖరారైపోయింది.

ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదన్న ప్రియాంక గాంధీ
కాగా, ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రానే అని త్వరలో ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున అన్ని తానపై ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (గోరఖ్పూర్ సదర్), ప్రతిపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్(కర్హాల్) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ స్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. యోగి కూడా ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా, వీరిద్దరూ ఎన్నికల్లో పోటీ దిగడం ఆసక్తికరంగా మారింది.

యూపీలో బీజేపీ, ఎస్పీల మధ్యే ప్రధాన పోటీ
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీకి మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఓపీనియన్ పోల్స్ మరోసారి బీజేపీ అధికారం చేపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, గతంలో కంటే బీజేపీకి సీట్లు తక్కువగా వస్తాయని, అఖిలేష్ పార్టీ పుంజుకుంటుందని పేర్కొన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలిపాయి.












Click it and Unblock the Notifications