వారిని వదిలిపెట్టేది లేదు: మరోసారి తేల్చేసిన మోడీ
న్యూఢిల్లీ: యూరీ దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. మన్కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా యూరీ దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు. అంతేగాక, ఈ విషయంలో సైన్యం మాట్లాడదని, తన పరాక్రమాన్ని చూపిస్తుందని తెలిపారు.
కాగా, 'ఉరీ ఘటనలో 18 మంది వీర సైనికులను కోల్పోయాం. వీర మరణం పొందిన సైనికులకు వందనం చేస్తున్నా' అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'ఉరీ ఘటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఉరీ ఘటన బాధిత కుటుంబాలకే కాదు. దేశ ప్రజల మనసులను గాయపరించింది' అని అన్నారు . అంతేగాక, భారత్.. సాఫ్ట్వేర్ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోందని ఘాటుగా స్పందించారు.
రియో పారాలింపిక్స్ విజేతలకు ప్రధాని అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్లో దీపా మాలిక్ విజయం మహిళల్లో ఎంతో స్ఫూర్తి నింపిందని అన్నారు. పారాలింపిక్స్లో జజారియా బంగారు పతకం సాధించి దేశం గర్వించేలా చేశాడని అభినందించారు. రానున్న పారాలింపిక్స్లోనూ క్రీడాకారులు రాణించాలని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
'స్వచ్ఛభారత్ ప్రారంభించి రెండేళ్లు గడిచాయి. చిన్నారుల నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని స్వచ్ఛభారత్ను విజయవంతం చేశారు. స్వచ్ఛ హెల్ప్లైన్ నెంబర్ 1969ను ప్రారంభిస్తున్నాం. భారత్ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ భారతంలో ఇప్పటి వరకు 2.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. రానున్న ఏడాది కాలంలో మరో 1.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తాం' అని ప్రధాని మోడీ వివరించారు.
కాగా, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుండటం పట్ల కాశ్మీరీ ప్రజలను మోడీ ఈ సందర్భంగా అభినందించారు. గాంధీ జయంతి నుంచి దీపావళి మధ్య కాలంలో దేశ ప్రజలు ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.