ఆర్మీ కీలక నిర్ణయం: యూరీ బ్రిగేడ్ కమాండర్ బదిలీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్లో సైనిక శిబిరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు జరిపిన ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యూరీ బ్రిగేడ్ కమాండర్ను బదిలీ చేస్తూ శనివారం ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రిగేడ్ కమాండర్ కే. సోమశంకర్ను బదిలీ చేసి ఆ స్థానంలో ఇటీవలే బ్రిగేడియర్గా పదోన్నతి పొందిన 28 మౌంటెయిన్ డివిజన్కు చెందిన ఎస్పి అహల్వత్ను నియమించినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం ఇచ్చేందుకు ఆర్మీ నిరాకరించింది.
సెప్టెంబర్ 18 తెల్లవారుజామున యూరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది భారత సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రతిష్టాత్మక సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరపడంలో భద్రతా బలగాల అలసత్వం కూడా ఉందనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపించాయి.
దీనిపై ఆర్మీ విచారణ చేపట్టింది. కాగా, యూరీ ఉగ్రదాడికి పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు పాల్పడినట్టు భారత్ అనుమానిస్తోంది. రెండు రోజుల క్రితం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి 40 మంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications