అమెరికన్లకు బిగ్ అలర్ట్..
ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంటోంది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.
గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. రాత్రంతా పోలీసులు పహారా చేపట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలిపెట్టారు.

ఈ పేలుడు నేపథ్యంలో భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. భారత్ లో తమ దేశ పౌరులకు భద్రతపరమైన హెచ్చరికను జారీ చేసింది. రెడ్ ఫోర్ట్ వద్ద సంభవించిన కారు పేలుడు ఉదంతాన్ని ప్రస్తావించింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారని, ప్రస్తుతానికి పేలుడుకు గల కారణాలు తెలియరావట్లేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను భారత్ అప్రమత్తం చేసిందని వివరించింది.
ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసింది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని తమ దేశ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. పేలుడు ఘటన, ఆ తర్వాత చోటు చేసుకుంటోన్న పరిణామాలు, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరింది.
తమ చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రదేశాలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. పర్యాటకులు తరచుగా వెళ్ళే ప్రదేశాల గురించి అప్రమత్తంగా ఉండాలని, అవనసర ప్రయాణాలను మానుకోవాలని స్పష్టం చేసింది. అటు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. శ్రీలంక, మొరాకో, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications