ఇస్లాంను త్యజించి..హిందూ మతాన్ని స్వీకరించిన వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసం రిజ్వీ
లక్నో: అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో- ఉత్తర ప్రదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ హిందువుగా మారారు. హిందూ మతాన్ని స్వీకరించారు. ఇస్లామ్ను త్యజించారు. తన ఒంటిపై కాషాయ వస్త్రాన్ని కప్పుకొన్నారు. నుదుట తిలకం ధరించారు. హిందూ సంప్రదాయ పద్ధతిన యజ్ఞాన్ని నిర్వహించారు. జంధ్యాన్ని ధరించారు. తన పేరును మార్చుకున్నారు. తాను మరణించిన తరువాత హిందూ సంప్రదాయపద్ధతుల్లో అంత్యక్రియలను నిర్వహించాలని అన్నారు.
అధికారం కోసం అర్రులు: బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి
హిందువుగా
జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా కొత్త పేరు పెట్టుకున్నారు. తాను ఇక పూర్తిస్థాయి హిందువునని, సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నానని వసీం రిజ్వీ ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్లోని దాస్నా దేవి ఆలయం ప్రధాన అర్చకుడు స్వామి యతి నర్సింఘానంద్ సరస్వతి చేతుల మీదుగా హిందూమతాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన- అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ముస్లిం మత పెద్దల నుంచి బెదిరింపులు..
ఇస్లాం మత పెద్దలు తనను మానసికంగా వేధిస్తున్నారని, తనను మతం నుంచి వెలివేశారని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారని, తనను నిర్మూలించిన వారికి ఇచ్చే బహుమతిని ప్రతి శుక్రవారం పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు. ఈ చర్యలతో తాను విసిగి పోయానని వసీం రిజ్వీ చెప్పారు. వసీం రిజ్వీ హిందూ మతాన్ని స్వీకరించడాన్ని సంత్ మహాసభ కూడా స్వాగతించింది. హిందువుగా మారి, సనాతన ధర్మాన్ని అనుసరించనున్న ఆయనను ఎవరూ ఏమి చేయలేరని స్పష్టం చేసింది.
రక్షణ కల్పించాలంటూ..
ముస్లిం మత పెద్దలు వసీం రిజ్వీకి వ్యతిరేకంగా ఫత్వాను జారీ చేసినందున ఆయన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని సంత్ మహాసభ ప్రతినిధులు చెప్పారు. ఆయనకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ విషయంపై స్పందించాలని కోరారు. హిందూ మతం గొప్పదనాన్ని అన్య మతస్తులు గుర్తించడం గొప్ప విషయమని, చేరాలనుకునే వారిని తాము స్వాగతిస్తామని చెప్పారు. మరణించిన తరువాత తన మృతదేహాన్ని స్వామి యతి నర్సింఘానంద్ సరస్వతికి అప్పగించాలని సూచించారు.
సుప్రీంకోర్టులో పిల్..
వసీం రిజ్వీ.. ముస్లిం మత పెద్దల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ముస్లిం మత గ్రంధం ఖురాన్లో పొందుపరిచిన కొన్ని పదాలను తొలగించాలని, హింసాత్మక పరిస్థితులకు అవి దారి తీస్తున్నాయని కోరుతూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ తరువాత ఆయనకు బెదిరింపులు తీవ్రం అయ్యాయి. ప్రాణాలు తీస్తామంటూ ముస్లిం సంఘాలు హెచ్చరించాయి.