యోగి సర్కార్: సైకిల్పై భార్య మృతదేహంతో ఓ వృద్ధుడి అంతిమయాత్ర: కాళ్ల మీద పడ్డా
లక్నో: ఉత్తర ప్రదేశ్..భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. బీజేపీకి పట్టుగొమ్మ. మెజారిటీ ఓటుబ్యాంకు ఆ పార్టీదే. లోక్సభ ఎన్నికలైనా.. అసెంబ్లీ పోలింగ్ అయినా.. బీజేపీని ఢీ కొట్టి నిలిచే సత్తా మరో పార్టీకి లేదక్కడ. కరోనా వైరస్ ఆ రాష్ట్రంలో వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. కరోనా బారిన పడి పలువురు మరణిస్తున్నారు. అలాంటి ఉత్తర ప్రదేశ్లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. సభ్యసమాజం అవమానంతో తలదించుకోవాల్సిన ఉదంతం అది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కరోనా భయం..
అంత్యక్రియలను నిర్వహించడానికి ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్పై మోసుకుంటూ తిరగాల్సి వచ్చింది. కరోనా బారిన పడి ఆమె మృతి చెంది ఉండొచ్చనే గ్రామస్తుల అనుమానమే దీనికి కారణమైంది. అంత్యక్రియలను నిర్వహించడానికి గ్రామస్తులెవరూ సహకరించలేదు.. సరికదా.. ఆమె మృతదేహానికి దహన సంస్కారాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా-కొన్ని గంటల పాటు ఆ వృద్ధుడు భార్య మృతదేహాన్ని సైకిల్పై మోస్తూ తిరిగాడు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారు దగ్గరుండి మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించారు.
జౌన్పూర్లో ఘటన..
జౌన్పూర్ జిల్లాలోని మడియావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వృద్ధుడి పేరు తిలక్ధారి సింగ్. భార్య రాజ్కుమారీ దేవితో కలిసి అంబర్పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. రాజ్కుమారి అనారోగ్యానికి గురి కావడంతో సోమవారం జౌన్పూర్లోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. సరైన వైద్యసదుపాయం, బెడ్ లభించకపోవడం వల్ల ఆమె మరణించారు. భార్య మృతదేహాన్ని తీసుకుని, తిలక్ధారి సింగ్.. అంబర్పూర్కు చేరుకున్నాడు. అంత్యక్రియలను నిర్వహించడానికి సహకరించాలని బంధుమిత్రులు, గ్రామస్తులకు విజ్ఙప్తి చేశాడు.
కరోనా సోకుతుందనే కారణంతో..
కరనా బారిన పడి ఆమె మరణించి ఉండొచ్చనే అనుమానంతో ఆ వృద్ధుడికి సహకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. గ్రామస్తులకు ప్రాధేయపడినప్పటికీ.. వారు చలించలేదు. కరోనా భయంతో అతని ఇంటికి వెళ్లే సాహసం కూడా చేయలేదు. మరోవంక- సమయం గడిచేకొద్దీ రాజ్కుమారి మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభించింది. గత్యంతరం లేక సైకిల్పై భార్య మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లాడు. ఒక్కడే చితిని పేర్చి.. భార్య మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధపడ్డాడు.
Recommended Video
దహన సంస్కారానికీ అడ్డు..
అక్కడ కూడా గ్రామస్తులు అడ్డుపడ్డారు. రాజ్కుమారి మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించడానికి అంగీకరించలేదు. తమ గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించొద్దంటూ ఆగ్రహించారు. అలా చేస్తే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనితో అతను పక్కనే ఉన్న మరో గ్రామానికి వెళ్లినా.. అక్కడా ఇదే అనుభవం ఎదురైైంది. దీనితో ఎటు పోవాలో.. ఏం చేయాలో దిక్కు తెలియని స్థితికి చేరుకున్నాడు. సైకిల్పై భార్య మృతదేహాన్ని మోస్తూ కొన్ని గంటల పాటు తిరిగాడు. ఈ సమాచారం తెలియడంతో మడియావూ పోలీసులు అంబర్పూర్కు చేరుకున్నారు. గ్రామ శివార్లలోని రామ్ఘాట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. రాజ్కుమారి కరోనా పాజిటివ్ అని డాక్టర్లు ధృవీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు.