ఉత్తరాఖండ్: బీజేపీ మేనిఫెస్టో విడుదల, 50వేల ఉద్యోగాలు, 3 ఫ్రీ ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు వరాలు
డెహ్రాడూన్: ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. ఉత్తరాఖండ్ దృష్టి పాత్ర 2022 లేదా విజన్ డాక్యుమెంట్ 2022 అనే పేరును ఈ మేనిఫెస్టోకు పెట్టారు.

ఉత్తరాఖండ్ అభివృద్ధికి రోడ్మ్యాప్ అంటూ నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరాఖండ్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లకు ఈ మేనిఫెస్టో రోడ్ మ్యాప్ లాంటిదని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటకం, వలసలను ఆపడం, ఉపాధి కల్పన, మహిళలు, రైతుల సాధికారత, ఉద్యానవనం, పాడిపరిశ్రమ అభివృద్ధికి కొత్త ప్రాధాన్యతనిస్తుంది.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత, డిసెంబర్ 2022 నాటికి చార్ ధామ్ హైవేను పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

50వేల ఉద్యోగాలు, 3 ఫ్రీ సిలిండర్లు, రైతులకు మరో రూ. 6వేలు
బీజేపీ అధికారంలోకి వస్తే యువతకు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, పేదలకు ప్రతి సంవత్సరం మూడు ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది, కొండ ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు రూ.40 వేలు, సీనియర్ సిటిజన్ల పింఛన్లను రూ.3,600లకు పెంచుతామని బీజేపీ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు. అదనంగా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కేంద్రం, రాష్ట్రం రెండూ ఒక్కొక్కటి రూ. 6,000 అందజేస్తాయి, ఇది ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు రూ. 12,000 నిధుల బదిలీ ప్రయోజనాన్ని అందిస్తుంది.
పేద కుటుంబాలకు నెలకు రూ. 2వేలు
సైనికులు, రైతులు, మహిళలు, యువకులు సహా వివిధ వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోవడానికి మేము 13 జిల్లాలకు వెళ్లాము. సలహా పెట్టెలను ఉంచడానికి ప్రతి అసెంబ్లీకి మొబైల్ టీమ్లను పంపాం. ప్రజలకు ఎలాంటి ఉత్తరాఖండ్ కావాలని అడిగాం, అని బీజేపీ నాయకుడు, మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 2025 నాటికి ఉత్తరాఖండ్ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. హరిద్వార్ను యోగా రాజధానిగా మార్చడమే మా లక్ష్యం.. పేద మహిళలను స్వావలంబన చేసేలా ప్రణాళిక ఉంది. పేద కుటుంబాలకు ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. అంతే కాకుండా నెలకు రూ.2000 ఇస్తాం. బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు, పేద పిల్లలకు నెలకు రూ.1000 అందజేస్తామని ఆయన తెలిపారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది.ఉత్తరాఖండ్లోని 70 అసెంబ్లీ స్థానాల్లో 632 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications