కోహ్లీకి రూ.47లక్షల వరద బాధితుల నిధుల చెల్లింపు: హరీశ్ సర్కారుకు మరో షాక్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెలువడనున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్లో మరో వివాదాస్పద ప్రభుత్వ నిర్ణయం వెలుగుచూసింది. ఆ రాష్ట్ర పర్యాటకరంగాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్ల
డెహ్రాడూన్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెలువడనున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్లో మరో వివాదాస్పద ప్రభుత్వ నిర్ణయం వెలుగుచూసింది. ఆ రాష్ట్ర పర్యాటకరంగాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుని.. అతనితో 1నిమిషం నిడివి ఉన్న ఓ వీడియో ప్రోమోను రూపొందించింది హరీశ్ రావత్ సర్కారు.
ఈ ప్రకటన కోసం కోహ్లీకి 2015 జూన్లో రూ.47.19లక్షలు చెల్లించింది. అయితే, కోహ్లీకి చెల్లించిన మొత్తం.. వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన నిధికి సంబంధించిన డబ్బులు అనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్కి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
2013లో కేదార్ నాథ్లో భారీగా వచ్చిన వరదలు పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందమందికిపైగా జల సమాధి అయ్యారు. అప్పట్లో కేదారనాథ్ వరద బాధితులను ఆదుకోవడం కోసం వారి సహాయార్థం కోసం ఏర్పాటు చేసిన నిధి నుంచే కోహ్లీకి చెల్లించినట్లు ప్రభుత్వ సమాధానంతో తేలింది.
కాగా, కోహ్లీ ఏజెంట్ బంటీ సజ్జె మాత్రం మరోలా స్పందించారు. అసలు విరాట్ కోహ్లీకి ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని బంటీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఎం మీడియా సలహాదారు సురేంద్ర కుమార్ స్పందిస్తూ.. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతో బీజేపీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు అని అన్నారు. కోహ్లీకి అందజేసిన మొత్తం గురించి సంబందిత విభాగంతో మాట్లాడి అసలు విషయం తెలుసుకుంటామని చెప్పారు.
ఇది ఇలా ఉంటే.. ఆర్టీఐ యాక్ కింద తాను దాఖలు చేసిన పిటిషన్కి సమాధానమిచ్చిన హరీశ్ రావత్ సర్కారు.. అందులో రుద్రప్రయాగ్ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీనే స్వయంగా ఆ మొత్తాన్ని కోహ్లీకి చెల్లినట్లు పేర్కొందని చెబుతూ ఓ జాతీయ మీడియాకు ఆ లేఖను సాక్ష్యంగా చూపారు ఆర్టీఐ ద్వారా ఉత్తరాఖండ్ సర్కారును సమాధానం కోరిన అజేంద్ర అజయ్. ఆ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి క్లియరెన్స్ మెయిల్ అందిన తర్వాతే రుద్రప్రయాగ్ జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ.. కోహ్లీకి చెల్లింపులు జరిపినట్లుగా ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని అజయ్ తెలిపారు.