Vande Bharat 2025: ఈ ఏడాది వందే భారత్ దూకుడు- పెరిగిన నెట్ వర్క్, స్లీపర్ రైళ్లు..!
ఈ ఏడాది భారత దేశ ప్రీమియర్ రైళ్లయిన వందే భారత్ లు గణనీయమైన పురోగతి సాధించాయి. ఒకప్పుడు డొక్కు రైళ్లలో దశాబ్దాల పాటు తిరిగిన ప్రయాణికులకు ఇవి ఎంతో ఊరటనిస్తున్నాయి. దీంతో ఏటికేడాది వీటి డిమాండ్ పెరుగుతోంది. అలాగే కొత్త రూట్లు, హాల్ట్ లు, కొత్త సర్వీసులు, స్లీపర్ వంటి సదుపాయాలకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు వందే భారత్ పై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. దీంతో ఈ ఏడాది వందే భారత్ ల సంఖ్య 164కు చేరింది.
ఇప్పటికే దేశ రాజధానితో పాటు వివిధ రాష్ట్రాల మధ్య పరుగులు తీస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ ఏడాది మరింత విస్తరించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్ల మధ్య మొత్తం 164 వందే భారత్ రైళ్లు ప్రయాణాలు చేస్తున్నాయి. దీంతో వీటిలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం 2019లో వందే భారత్ లను ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ వీటిలో మొత్తం ప్రయాణాల సంఖ్య 7.5 కోట్లు దాటిపోయింది.

ఈ ఏడాది పలు కొత్త రూట్లలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ల సేవలు ప్రారంభమయ్యాయి. వీటిలో ప్రధాని మోడీ నవంబర్ 8న వారణాసిలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వీటిలో బనారస్-ఖజురాహో, ఫిరోజ్పూర్-దిల్లీ, లక్నో-సహారన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాలు ఉన్నాయి. ఆగస్టులో బెంగళూరు నుండి మరో మూడు వందే భారత్ లు ప్రారంభమయ్యాయి. వీటిలో బెంగళూరు-బెలగావి, శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా-అమృత్సర్, అజ్ని (నాగ్పూర్)-పూణే ఉన్నాయి. తాజాగా నరసాపూర్-చెన్నై మార్గానికి వందేభారత్ ను పొడిగింపుతో ప్రారంభించారు.
ఈ ఏడాది వందే భారత్ రైళ్ల చరిత్రలో తొలిసారి స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే జనవరిలో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడంతో పాటు ఆ తర్వాత న్యూ దిల్లీ-హౌరా, న్యూ దిల్లీ-ముంబై వంటి రాత్రి మార్గాల్లో సేవలు కూడా ప్రారంభించారు. ఈ 16-కోచ్ మోడల్లో ఏసీ ఫస్ట్ క్లాస్, టూటైర్, త్రీటైర్ బెర్త్ లతో 823 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం ఉంది. అలాగే ప్రమాదాలు జరగకుండా కవచ్ వ్యవస్ధతో పాటు 180 కిలోమీటర్ల వేగం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది వందే భారత్ ల సంఖ్య 164కు చేరగా.. నెట్ వర్క్ విస్తరణ 274 జిల్లాలకు చేరింది. ఇందులో తీర్థయాత్ర, వ్యాపార, ప్రాంతీయ ప్రయాణాలు కూడా పెరిగాయి. జూన్ 6న ప్రారంభించిన శ్రీనగర్-కాట్రా, బెంగళూరు-హైదరాబాద్ వంటి మార్గాలు ఐటీ నిపుణులు, భక్తుల ప్రయాణాలకు ప్రసిద్ధి చెందాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 200 రైళ్ల ఉత్పత్తిని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.












Click it and Unblock the Notifications