Rain alert: ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
జులై 1న పశ్చిమ రాజస్థాన్పై భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జూన్ 30న ఉత్తరాఖండ్ మీదుగా, జూన్ 28న తూర్పు రాజస్థాన్, జూన్ 28, జులై 1 తేదీలలో పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా, జూన్ 29, 30 తేదీలలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్సాలు కురుస్తాయని తెలిపింది.

ఏపీతోపాటు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో రానున్న కొద్ది రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ కొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

తెలంగాణ, కోస్తాంధ్ర, కర్ణాటకలో అతి భారీ వర్షాలు
ఉప హిమాలయన్ పశ్చిమబెంగాల్, కోస్తాంధ్ర, తెలంగాణ, కోస్తా కర్ణాటక వచ్చే కొద్ది రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని ఉప హిమాలయన్ పశ్చిబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములుమెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం ఇప్పటికే భారీ వర్షాలతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వందమందికిపైగా భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించారు.

రుతుపవనాల రాక.. చల్లబడిన దేశ రాజధాని ఢిల్లీ
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో నగరవాసులకు ఎండలనుంచి ఉపశమనం లభించింది. మంగళవారం కూడా నల్లని మేఘాలు కమ్ముకుంటాయని, వాతావరణ చల్లగానే ఉంటుందని తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
కాగా, జూన్ 30 లేదా జులై 1 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని తెలిపింది. ఢిల్లీలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న వర్షాభావ పరిస్థితులు వచ్చే వారంలో భర్తీ అవుతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications