ఏ క్షణమైనా భారత్ కు విజయ్ మాల్యా- న్యాయ ప్రక్రియ పూర్తి- రాగానే సీబీఐ, ఈడీ అదుపులోకి....
భారత్ లో బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఇఫ్పటికే బ్రిటన్ ప్రభుత్వంతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు అక్కడి కోర్టులను ఒప్పించిన భారత సర్కార్.. మాల్యాను ఏ క్షణమైనా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మాల్యా అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తయిందని, ఆయన్ను ఏ క్షణమైనా భారత్ తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. తనను భారత్కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది.
వచ్చే కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా మేము మాల్యాని భారత్కు తరలించవచ్చని ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి మీడియాకు వెల్లడించారు.

అయితే ఏ తేదీన మాల్యా తరలింపు ఉంటుందన్న దానిపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు.
కాగా విజయ్ మాల్యాను భారత్కు తరలించే విషయమై సీబీఐ, ఈడీ అధికారులు యూకేలో ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. తొలుత తామే కేసు నమోదు చేశాం కాబట్టి... మాల్యా భారత్కు రాగానే ముందు మేమే కస్టడీలోకి తీసుకుంటాం.. అని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్ల రుణాలకు సంబంధించి విజయ్ మాల్యా మోసం, మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications