జనవరి 9న థియేటర్లలో.. 2026లో అసెంబ్లీలో.. విజయ్ మాస్టర్ ప్లాన్!
ప్రముఖ నటుడు, తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ తన సినీ ప్రయాణానికి స్వస్తి పలుకుతూ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆయన రూపొందించిన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా విజయ్ తన చివరి సినిమాను ఓ బలమైన ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు(డిసెంబర్ 18) అటు రాజకీయంగా, ఇటు సినీపరంగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈరోడ్లో భారీ బహిరంగ సభ
గతంలో కరూర్ ఘటన తర్వాత విజయ్ నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద బహిరంగ సభ నేడు ఈరోడ్ సమీపంలోని విజయమంగళం టోల్ ప్లాజా వద్ద జరుగుతోంది. దాదాపు 25,000 మందికి పైగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు. 2026 ఎన్నికల నాటికి తన కేడర్ను బలోపేతం చేసే దిశగా విజయ్ ఇక్కడ కీలక ప్రసంగం చేయనున్నారు.

'జన నాయగన్'.. సినీ ప్రయాణంలో చివరి అంకం
విజయ్ నటించబోయే చివరి చిత్రం 'జన నాయగన్. ఇది కేవలం సినిమాగా మాత్రమే కాకుండా, దీనిని తన రాజకీయ ఇమేజ్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వారధిలా వాడుకుంటున్నారు. ఈ చిత్రం రెండో పాట 'ఒరు పేరే వరలారు' (ఒక పేరే చరిత్ర) ఈ సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. "ఒక పేరు చరిత్ర సృష్టిస్తుంది, దానిని ఎవరూ చెరపలేరు" అనే అర్థం వచ్చేలా ఉన్న లిరిక్స్, విజయ్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ సినిమాను జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విజయ్ వ్యూహం ఏంటి?
విజయ్ తన సినిమాల ద్వారా సంపాదించుకున్న 'మాస్ ఇమేజ్'ను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నారు. గతంలో ఎం.జి. రామచంద్రన్ ఏ విధంగానైతే వెండితెరపై సామాన్యుడి ప్రతినిధిగా మెరిసి, ముఖ్యమంత్రి అయ్యారో.. విజయ్ కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నారు. తన ప్రసంగాల్లో అటు అధికార డీఎంకేను, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ.. మార్పు కోరుకునే ప్రజలకు తాను ప్రత్యామ్నాయం అని చాటిచెబుతున్నారు.












Click it and Unblock the Notifications