బీజేపీతో పొత్తుపై తేల్చేసిన విజయ్ ..! సీబీఐ రెండో పిలుపు వేళ ..!
తమిళనాడులో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకుంటున్నాయి. టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ తో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఆయనపై ఒత్తిడి పెంచుతోంది. ఇదే క్రమంలో కరూర్ తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. తాజాగా ఢిల్లీ కార్యాలయానికి పిలిపించి ఏడు గంటల పాటు ప్రశ్నించింది. దీంతో ఆగకుండా ఈ నెల 19న మరోసారి రావాలని సమన్లు పంపింది.
ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై హీరో విజయ్ క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ ను దారికి తెచ్చుకునేందుకే సీబీఐతో ఇలా సమన్లు ఇప్పిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. బీజేపీతో పొత్తు ఉండబోదని ఆయన తేల్చిచెప్పేశారు. విజయ్ ఇప్పటికే బీజేపీని తనకు సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దానితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని చెప్పేశారు. అలాగే అన్నాడీఎంకేతో కూడా పొత్తు పెట్టుకోబోమని వెల్లడించారు. దీంతో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి.

తాజాగా విజయ్ కెరీర్ చివరి సినిమా జన నాయగన్ కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో సంక్రాంతికి విడుదల చేయలేకపోయారు. తాజా పరిణామాలతో ఆగ్రహంగా ఉన్న విజయ్.. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు అధికార డీఎంకేకు వ్యతిరేకంగా పోరాడేందుకు విజయ్ ను ఎన్డీయేలోకి తెచ్చుకునేందుకు బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అలాగే కాంగ్రెస్-టీవీకే పొత్తు కుదరవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా తమిళనాడు పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ విజయ్ సినిమా విషయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖను, ప్రధాని మోడీని టార్గెట్ చేయడం టీవీకే-కాంగ్రెస్ పొత్తుకు మార్గం సుగమం చేశాయి. అలాగే 'జన నాయగన్'ను అడ్డుకోవడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి అని ఎక్స్ లో పోస్టు కూడా పెట్టారు. మిస్టర్ మోడీ, మీరు తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో ఎప్పటికీ విజయం సాధించలేరన్నారు.












Click it and Unblock the Notifications