హెచ్-1బీ వీసా వ్యవస్థలో భారీ అక్రమాలు: ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం!
అమెరికాలో ఐటీ కొలువులు సాధించాలనుకునే విదేశీ నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా వ్యవస్థపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఈ వీసా ప్రోగ్రామ్లో నిబంధనలను ఉల్లంఘించి జరుగుతున్న భారీ అక్రమాలపై అమెరికా కార్మిక శాఖ సమగ్ర దర్యాప్తును ముమ్మరం చేసింది. వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, స్థానిక అమెరికన్ల ఉపాధికి గండి కొడుతున్న విదేశీ మోసగాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తీవ్రంగా హెచ్చరించారు.
మిల్వాకీలోని విస్కాన్సిన్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్లో జరిగిన ఓ సైనిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జేడీ వాన్స్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఐటీ రంగానికి చెందిన అద్భుతమైన సాంకేతిక నిపుణులు చట్టబద్ధంగా వచ్చి పనిచేసేందుకు వీలుగా గతంలో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ను ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థను కొందరు పూర్తిగా పక్కదారి పట్టించారని ఆయన మండిపడ్డారు.

కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలు, విదేశీ దళారులు ఈ వీసా వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని అమెరికా స్థానిక కార్మికుల వేతనాలను దారుణంగా తగ్గిస్తున్నారని జేడీ వాన్స్ ఆరోపించారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాపాడటంతో పాటు, చట్టబద్ధమైన వీసా విధానాన్ని దుర్వినియోగం కాకుండా చూడటమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగాలు కేవలం అమెరికన్లకే దక్కాలన్నది తమ ప్రభుత్వ స్పష్టమైన విధానమని వాన్స్ స్పష్టం చేశారు.
కార్మిక శాఖ దూకుడు.. రంగంలోకి ఇన్వెస్టిగేషన్ టీమ్
ఈ భారీ వీసా మోసాలను అరికట్టేందుకు అమెరికా కార్మిక శాఖ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు అనుమానం ఉన్న సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. విదేశీ కార్మికుల వీసా ప్రోగ్రామ్లను దుర్వినియోగం చేయడం, మానవ అక్రమ రవాణా, కార్మికుల దోపిడీ వంటి తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డిస్పోసిటో స్పష్టం చేశారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత కఠినమైన చర్య కాబోతోందని ఆయన వెల్లడించారు.
కొన్ని అజ్ఞాత వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం ఆధారంగా దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఈ అక్రమాల్లో కాగ్నిజెంట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థల పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో దళారులు నకిలీ దరఖాస్తులు సమర్పించడం, విదేశీ కార్మికుల వేతనాల నుంచి అక్రమంగా కమీషన్లు వసూలు చేసే ముఠాల గుట్టును రట్టు చేయడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి.
మూల్యం చెల్లించుకోవాల్సిందే..
సాధారణంగా ప్రతి ఏటా భారత్ నుంచి వేలాది మంది ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ నిపుణులు హెచ్-1బీ వీసాల ద్వారా అమెరికాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భారతీయ ఐటీ రంగానికి కూడా సవాలుగా మారే ప్రమాదం ఉంది. అమెరికా ఉద్యోగాల విషయంలో స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే తమ జాతీయ విధానానికి కట్టుబడి, ఇలాంటి అక్రమ వీసా మార్గాలను పూర్తిగా మూసివేయాలని అమెరికా ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
నిజమైన నైపుణ్యాల కొరతను భర్తీ చేయడానికి ఉద్దేశించిన వీసా విధానాలు, స్వార్థపూరిత శక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అమెరికా కార్మిక శాఖ స్పష్టం చేసింది. వైస్ ప్రెసిడెంట్ టాస్క్ ఫోర్స్తో కలిసి విచారణ సంస్థలు సంయుక్తంగా ఈ తనిఖీలను మరింత ఉధృతం చేయనుండటంతో, వీసా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంస్థలు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications