ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం? ఒకే ఒక్క నామినేషన్ ..!
ఏపీలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ (AP Legislative Council Deputy Chairman) ఎన్నిక ఇవాళ జరుగుతోంది. ఇందులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును (Tumati Madhava Rao)పార్టీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్ధిగా ఎంపిక చేశారు. దీంతో తూమాటి మాధవరావు.. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. అయితే ఆయనకు పోటీగా అభ్యర్ధిని నిలబెడుతుందని భావించిన టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. అసలు అభ్యర్ధిని నిలబెడుతున్నారో లేదో కూడా తెలియకుండా టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
ప్రస్తుతం శాసనమండలిలో వైఎస్సార్సీపీకే మెజార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో టీడీపీ ఒకవేళ అభ్యర్దిని నిలబెడితే వైసీపీ ఎమ్మెల్సీలను చీల్చి తమ అభ్యర్ధిని గెలిపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో దీనికి టీడీపీ అధిష్టానం మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శాసనమండలి ఛైర్మన్ గానూ మరో వైసీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు ఉన్నారు.

ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కమ్మ సామాజిక వర్గ నేత అయిన తూమాటి మాధవరావును వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం మద్దతుగా నిలిచే పార్టీ అయిన టీడీపీని ఆత్మరక్షణలో పడేసేందుకు జగన్ ఈ ఎత్తు వేసినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు తూమాటి మాధవరావుపై టీడీపీ మరో సామాజిక వర్గ అభ్యర్ధిని నిలబెట్టలేదు, అలాగని కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్ధిని నిలబెట్టినా గెలిపించుకోవడంలో విఫలమైతే సమస్యలు తప్పవు. అందుకే వ్యూహాత్మకంగా టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్ల గడువు ఉంది. ఆ లోపు మరో నామినేషన్ రాకపోతే తూమాటిని డిప్యూటీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.














Click it and Unblock the Notifications