ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య: యుపిలో చెలరేగిన హింస
ఫిరోజాబాద్: ఉత్తర్ప్రదేశ్ ఫిరోజాబాద్ సమీపంలోని రాంఘడ్ ప్రాంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లను కాల్చి చంపిన ఘటన హింసకు దారి తీసింది. దినేష్ ప్రతాప్ సింగ్, గిరిరాజ్ కిషోర్ గజర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆదివారం రాత్రి ఒక దోపిడీ దుండగుల ముఠాను వెంబడించారు.
దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో గిరిరాజ్ కిషోర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దినేష్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్టేషన్ అధికార భాధ్యతలు నిర్వహిస్తున్న స్టేషన్ ఆఫీసర్ అజయ్ కుమార్, ఎస్సై ఒమర్ ఫరూఖ్లను డీఐజీ సస్పెండ్ చేశారు.
మరోవైపు పోలీస్ ఉన్నతాధికారులు వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందంటూ, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో హింస చెలరేగింది. ఈ హింసలో డిఐజి విజయ్ సింగ్ మీనాతో పాటు పలువురు వ్యక్తులు గాయపడ్డారు.
కానిస్టేబుళ్లను హత్య చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని సుభాష్ కార్స్ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై బైఠాయించి, ట్రాఫిక్ను నిరోధించారు. ఓ పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు.