Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాంబే హైకోర్టులో వరవరరావు బెయిల్‌ పిటిషన్‌.. ఇప్పుడాయన ఆరోగ్యం ఎలా ఉంది

వరవరరావు

భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావు, మధ్యంతర బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

ఆరోగ్యం క్షీణించడం, కరోనా భయాల ఆధారంగా ఆయన మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ వరవరరావు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను జూన్‌ 26న ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

వరవరరావు తరఫున న్యాయవాది సత్యనారాయణ అయ్యర్‌ బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

ఎన్‌ఐఏ కోర్టు వరవరరావు బెయిల్‌ తిరస్కరణను ఒక పిటిషన్‌లో సవాల్ చేసిన ఆయన, రెండో పిటిషన్‌లో జూన్‌2న జేజే ఆసుపత్రి నుంచి వరవరరావు డిశ్చార్జ్‌ అయ్యాక ఆయన మెడికల్‌ రిపోర్టులను తమకు ఇచ్చేలా తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

వరవరరావు ఇప్పుడెలా ఉన్నారు?

వరవరరావు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇటీవలే ఆయన కుటుంబ సభ్యులు మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్జప్తి చేశారు.

ప్రస్తుతం ఆయన్ను జేజే ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఆయనకు టెస్టులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

"అర్ధరాత్రి వరకు వేరు వేరు టెస్టులు జరిగాయని మాకు తెలిసింది. ఇన్‌పేషంట్‌గా చేర్చుకుంటామో లేదో చెప్పలేమని వైద్య అధికారులు అన్నారు. అయితే టెస్ట్ రిజల్ట్ రావడానికి, అబ్జర్వేషన్‌కు టైం కావాలి గనుక కనీసం రెండురోజులు ఆసుపత్రిలోనే ఉంచవచ్చు'' అని వరవరరావు బంధువు, వీక్షణం పత్రిక ఎడిటర్‌ ఎన్‌.వేణుగోపాల్ బీబీసీకి తెలిపారు.

" శుక్రవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉంది. అందుకే అధికారులు ఆయనకు చికిత్స పేరుతో హడావుడి చేస్తున్నారు. గురువారంనాటికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి తిరిగి జైలుకు పంపే ప్రమాదం కూడా ఉంది'' అని వేణుగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మే 28న వరవర రావును ముంబయిలోని జేజే ఆసుపత్రిలో చేర్చారు. కానీ అతని ఆరోగ్యం మెరుగుపడకముందే తిరిగి జైలుకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆయనకు బెయిల్‌ ఇవ్వవద్దని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఇప్పటికే విజ్జప్తి చేసింది.

వరవరరావుపై ఆరోపణలేంటి ?

మావోయిస్టులతో కలిసి ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై వరవరరావు దాదాపు ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు.

వరవరరావుతోపాటు మరో నలుగురిని పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు.

మహారాష్ట్రలో భీమా-కోరెగావ్‌ అల్లర్లలో పాత్ర, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్ర వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి.

వరవరరావును మొదట్లో పుణెలోని ఎరవాడ జైలులో ఉంచారు. అనంతరం అక్కడి నుంచి కొన్నాళ్ల కిందట నవీ ముంబయిలోని తలోజా జైలుకు ఆయన్ను తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+