తమిళులకు ప్రేమతో..: బెంగళూరులో గర్జించిన హీరో విశాల్
బెంగళూరు: ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటుడు విశాల్ తమిళనాడు ప్రజల కోసం ఎవరూ చేయని సాహసమే చేశారు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే విశాల్ తమిళ ప్రజల బాధలను అందిరికీ తెలిసేలా చేశారు.
బెంగళూరు: ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటుడు విశాల్ తమిళనాడు ప్రజల కోసం ఎవరూ చేయని సాహసమే చేశారు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే విశాల్ తమిళ ప్రజల బాధలను అందిరికీ తెలిసేలా చేశారు. తమిళనాడు, కర్ణాటక మధ్య ఇప్పటికే కావేరి జలాల వివాదం తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
విశాల్ సంచలనం
కావేరి జలాల అంశం బెంగుళూరులో జరిగిన ఓ కన్నడ చిత్రం ఆడియో ఫంక్షన్లో విశాల్ లేవనెత్తి సంచలనంగా మారారు. కొద్దికాలం క్రితం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్, విజయ్ తదితరులు కావేరీ జలాల అంశంపై చెన్నైలో నిరాహార దీక్ష చేయడం, దీనిపై కన్నడిగులు అగ్గిమీద గుగ్గిలం కావడం తెలిసిందే.
సాహసమే..
వారు చైన్నైలో దీక్షలు చేస్తేనే కన్నడిగులు భగ్గుమన్న సందర్భాలున్న నేపథ్యంలో ఏకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోనే కావేరీ జలాల వివాదం గురించి ప్రస్తావించిన విశాల్ది సాహసమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు, నడిగర సంఘం కారదర్శి కూడా అయిన విశాల్ బెంగళూరు ఆడియో ఫంక్షన్లో స్వయంగా కావేరీ జలాల సంక్షోభాన్ని ప్రస్తావించడమే కాకుండా పూర్తిగా తమిళంలోనే మాట్లాడారు.
అది మా హక్కు...
'తమిళంలో మాట్లాడటానికి నేను గర్విస్తున్నాను. అలా మాట్లాడకుండా నన్నెవరూ ఆపలేరు కూడా. నీళ్లు అడగడం మా హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరు. మనమంతా భారతీయులం. కన్నడ గడ్డపై ఉన్న తమిళ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి వారికి ఉంది' అని స్పష్టం చేశారు.
సహకరించుకోవాలి...
అంతేగాక, తమిళనాట ఉన్న కన్నడ ప్రజల పరిరక్షణ బాధ్యత తమిళులదేనని చెప్పారు. కన్నడ నిర్మాతలు సినిమా తీసేందుకు తమిళనాడు వస్తే వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు తాము అందిస్తామని విశాల్ ఉద్వేగ ప్రసంగం చేశారు. కాగా, ఈ వేడుక ముగియగానే పునీత్ రాజ్కుమార్ (నట దిగ్గజం రాజ్కుమర్ తనయుడు) తల్లికి నివాళులర్పించేందుకు విశాల్ ఆయన ఇంటికి వెళ్లారు.