విస్తారా విమానాలు ఇక కనిపించవు: టికెట్ల బుకింగ్ నిలిపివేత
Vistara: దేశీయ పౌర విమానయాన సంస్థ విస్తారా.. ఇక కనుమరుగు కాబోతోంది. నవంబర్ 11వ తేదీన చివరి ఫ్లైట్ తన సర్వీసులను అందిస్తుంది. అదే రోజు అర్ధరాత్రి నుంచి విస్తారా ఫ్లైట్లు అందుబాటులో ఉండబోవు. విమాన సర్వీసుల బుకింగ్ కూడా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి స్తంభించిపోనుంది.
దీనికి కారణాలు లేకపోలేదు. విస్తారా పౌర విమానయాన సంస్థ.. ఎయిరిండియాలో విలీనం కాబోతోండటమే. ఇప్పటికే విలీన ప్రక్రియ ఆరంభమైంది కూడా. నవంబర్ 12వ తేదీనాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. అప్పటి నుంచి విస్తారాకు చెందిన విమానాలన్నీ కూడా ఎయిరిండియాపరం అవుతాయి.

ఈ విషయాన్ని విస్తారా యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. విలీన ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థ విమానాల్లో బుకింగ్స్, సర్వీసులు ఎంతోకాలం అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసిందా సంస్థ యాజమాన్యం.
విలీన ప్రక్రియ పూర్తి కావడానికి నెలన్నర రోజుల నుంచే అంటే సెప్టెంబర్ 3వ తేదీ నుంచే టికెట్ల బుకింగ్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 12వ తేదీ నుంచి తమ సంస్థకు చెందిన విమానాల సర్వీసులన్నింటినీ ఎయిరిండియా పర్యవేక్షిస్తుందని, బుకింగ్ మొదలుకుని అన్ని సేవలు కూడా ఎయిరిండియా ద్వారానే అందుతాయని వివరించింది.
నవంబర్ 12వ తేదీ తరువాత విస్తారా విమానాల్లో ప్రయాణించేలా బుక్ అయిన టికెట్లన్నినీ కూడా ఎయిరిండియాకు బదిలీ అవుతాయి. అలాంటి వారికి ఎయిరిండియా నుంచి ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. ఎయిరిండియా విమాన సర్వీస్ నంబర్లతో కూడిన సమాచారం వారికి అందుతుంది.












Click it and Unblock the Notifications