సారీ- నా వల్లే పార్టీ మునిగింది: సీఎం సలహాదారు గుడ్బై
VK Pandian: ఒడిశాలో బిజూ జనతాదళ్ పాలనకు తెర పడిన నేపథ్యంలో అక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. 24 సంవత్సరాల పాటు ఏకధాటిగా కొనసాగిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి.. మొన్నటి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశా అసెంబ్లీలో బిజూ జనతాదళ్ 51 నియోజకవర్గాలకే పరిమితమైంది. బీజేపీ 78 సీట్లతో అక్కడ అధికారాన్ని అందుకుంది. ఈ నెల 12వ తేదీన ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలు లభించాయి. లోక్సభలో బీజేడీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. 20కి 20 సీట్లలోనూ కమలం వికసించింది.

ఈ పరాజయానికి- మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముఖ్య సలహాదారు, 5టీ ఛైర్మన్ వీకే పాండ్యన్.. నైతిక బాధ్యతను వహించారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించారు. తన వల్లే పార్టీ ఓటమి పాలైందని భావిస్తున్నట్లు చెప్పారు. నైతిక బాధ్యతగా గత ప్రభుత్వం తనకు ఇచ్చిన పదవులకు రాజీనామా చేస్తోన్నానని, రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు వీకే పాండ్యన్ ఓ వీడియోను విడుదల చేశారు. తనను క్షమించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నవీన్ పట్నాయక్ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఓటమి నేపథ్యంలో క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని అన్నారు. ఎవరినైనా నొప్పించివుంటే క్షమించాలని చెప్పారు.
బిజూ జనతాదళ్ ఓటమిలో భాగస్వామి అయినందుకు క్షమించాలని వీకే పాండ్యాన్ కోరారు. లక్షలాదిగా ఉన్న బిజూ జనతాదళ్ నాయకులు, కార్యకర్తలు మన్నిస్తారని, వారికి, ఒడిశాకు ఎల్లప్పుడూ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. నవీన్ పట్నాయక్ మళ్లీ పుంజుకొంటారని ఆశిస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications