జమిలి ఖరారు వేళ - బిగ్ టర్న్..!!
జాతీయ స్థాయిలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటుగా ఈ రోజు జరుగుతున్న ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలకు అనుగుణంగా జమిలి నిర్వహణ.. సమయం పైన కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ సరళి పైన ప్రధాన పార్టీలు ఆసక్తితో చూస్తున్నాయి.
మొదలైన పోలింగ్
జార్ఖండ్ లో తొలి విడత పోలింగ్ మొదలైంది. జార్ఖండ్ లో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. 683 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 1.37 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే విధంగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ లోక్ సభ స్థానంతో పాటుగా దేశ వ్యాప్తంగా 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు.

బరిలో ముఖ్య నేతలు
జార్ఖండ్ లో జరుగుతున్న తొలి విడత పోలింగ్ లో పలువురు ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. మాజీ సీఎం చంపయీ సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ తో పలువురు నేతలు పోటీలో నిలిచారు. జార్ఖండ్ లో రెండు ప్రధాన కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. జేఎంఎం కూటమిని ఓడించేందుకు బీజేపీ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. రెండు దశల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. రెండు కూటములు ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ మేనిఫెస్టోలను ప్రకటించారు.
ప్రతిష్ఠాత్మకం
దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం తొలుత 33 అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, సిక్కింలోని 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 31 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. ప్రియాంక గాంధీ బరిలో నిలిచిన కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి పోలింగ్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడ్ తో పాటుగా రాయబరేలీలో గెలిచిన రాహుల్ గాంధీ.. వాయనాడ్ స్థానానికి రాజీనామా చేసారు. దీంతో, సోదరుడు గెలిచిన స్థానంలో ప్రస్తుతం ప్రియాంక పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవటం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరి, బిజెపికి చెందిన నవ్య హరిదాస్లపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ సైతం రెండు రాష్ట్రాలతో పాటుగా ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications