మమతా బెనర్జీ వర్సెస్ జగ్దీప్ ధన్ఖర్.. గవర్నర్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన సీఎం
పశ్చిమబెంగాల్లో రాజకీయాలు మరో సారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ ట్విటర్ను దీదీ బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. గవర్నర్ ట్వీట్లతో తాను చిరాకు చెందినట్లు తెలిపారు. అందుకే మైక్రోబ్లాగింగ్ ద్వారా ట్విటర్లో గవర్నర్ను బ్లాక్ చేసినట్లు ఆమె చెప్పారు.
గవర్నర్ బెదింపులు..
రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ ఎవరిని లెక్కచేయడంలేదంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను గవర్నర్తో మాట్లాడానని.. అయినా ఆయన వినడం లేదని దుయ్యబట్టారు. అందరనీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ తీరుతో గత ఏడాది నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. తాము పంపిన ప్రతి ఫైలును పెండింగ్లో పెడుతున్నారని మండిపడ్డారు. విధాన నిర్ణయాలపై గవర్నర్ ఎలా మాట్లాడతారని దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగ్దీప్ ధన్ఖర్ను తొలగించండి..
గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ తీరుపై పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసినట్లు సీఎం మమతా బెనర్జీ గుర్తుచేశారు. అంతే కాకుండా తానే స్వయంగా వెళ్లీ కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. అయినా గవర్నర్ను ఎందుకు తొలగించడం లేదని కేంద్రాన్ని దీదీ నిలదీశారు. తమ ప్రభుత్వాన్ని తన కింది కార్మికులుగా చూస్తూ కించపరిచే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు ప్రతి రోజూ అధికారులను లక్ష్యంగా చేసుకుని బెదిరించేలా ట్వీట్లను పెడుతున్నారని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ల ట్యాప్ దుమారం
తమ ఫోన్లను సైతం గవర్నర్ ట్యాప్ చేస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వ్యవహారంలో తలదూర్చుతూ .. అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను పెగాసస్ స్పై వేర్ను ఉపయోగించి ట్యాప్ చేస్తోందని బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ ఆరోపించారు. ఆయన ఆరోపణలు చేసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.