కుండపోత వర్షాల భయం! రానున్న 72 గంటలు ఎల్లో అలర్ట్
అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం, రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటం, అలాగే ఉత్తర కోస్తా నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

తీర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన
ఉత్తర-దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనూ, యానాం ప్రాంతంలోనూ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కొన్ని చోట్ల గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గాలి వేగం 30-50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. రాగల ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్లో కుండపోత వర్షం
మరోవైపు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎల్లారెడ్డిగూడ వంటి ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.














Click it and Unblock the Notifications