West Bengal: భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరారైన భార్య
West Bengal: సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మహిళలు కూడా ప్రియుడి మోజులో పడి భర్తలను మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన భర్తతో కిడ్నీ అమ్మించి ఆ వచ్చిన డబ్బులు తన కూతురి చదువుతో పాటు పెళ్లికి ఉపయోగపడుతాయని చెప్పి నమ్మించి మోసం చేసింది. కుటుంబానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని భార్య పట్టుబట్టడంతో చేసేదేమీ లేక అతను తన కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించాడు. అనంతరం వచ్చిన డబ్బు తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. బాధితుడి కుటుంబంలో భార్య, పదేళ్ల కూతురు ఉన్నారు.
ఆ ఇల్లాలు ఫేస్ బుక్ లో పరిచయమైన రవిదాస్ అనే వ్యక్తితో పరారైంది. తన భార్య బరాక్ పూర్ లోని సుభాష్ నగర్ లో రవిదాస్ తో ఉంటోందని తెలుసుకున్నాడు. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేశాడు. పోలీసుల సాయంతో కుటుంబంతో పాటు వారు ఉన్న ప్రాంతానికి వెళ్లగా.. తన భర్తతో మాట్లాడడానికి భార్య నిరాకరించింది. ఇంట్లోనే ఉండి తలుపు గడియ పెట్టుకుంది. ఏం చేసుకుంటావో చేసుకో.. విడాకులు ఇస్తానని భర్త మీద ఇంట్లో నుంచే గట్టిగా అరిచేసింది. పదేళ్ల కూతురు మీద కూడా కనికరం చూపించలేదు. ఇప్పుడు రవిదాస్, బాధితుడి భార్యపై కేసు నమోదైంది. కట్టుకున్న భార్య మాటలు నమ్మి మోసపోయానని.. ఎలాగైనా తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను బాధితుడు వేడుకున్నాడు.

కిడ్నీని అమ్మిన తర్వాత డబ్బుతో కూతురు భవిష్యత్ బాగుపడుతుందని అనుకున్నానని, కానీ భార్య దురుద్దేషాన్ని పసిగట్టలేకపోయానని.. చివరికి ప్రియుడితో పారిపోయిందని బాధితుడు వాపోయారు. తన కిడ్నీని ఎవరైనా కొంటారేమే అని గత నెల రోజులుగా వెతికామన్నారు. అలా ఒక నెల రోజుల తర్వాత కిడ్నీ అమ్ముడుపోయిందని చెప్పారు. అనంతరం ఆ డబ్బులను తన భార్యతో కలిసి వెళ్లి తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఆ మొత్తాన్ని బ్యాంకులో వేస్తానని తన భార్య తీసుకుందని.. అనంతరం ప్రియుడితో కలిసి పరారైందని బాధిత భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. మరీ ఈ కేసులో పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications