చంద్రబాబు, నితీష్ పై ఇండీ కూటమి ఆశల వెనుక ? మోడీ, షా అలర్ట్-కీలక నిర్ణయం..!
తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే, ఇండియా కూటములకూ వచ్చిన సీట్లు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే కూటమి ఢిల్లీలో నిన్న నిర్వహించిన భేటీకి చంద్రబాబు, నితీష్ వంటి కీలక భాగస్వాములు హాజరయ్యారు. తద్వారా తమ మద్దతు ఎన్డీయేకే ఉంటుందని తేల్చిచెప్పేశారు. అదే సమయంలో ప్రధాని మోడీ ముందు తమ డిమాండ్లు ఉంచారు. అయితే ఇండీ కూటమి మాత్రం వీరిపై ఇంకా ఆశలు పెట్టుకుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి.

నిన్న ఎన్డీయే కూటమి భేటీలో చర్చల తర్వాత ఇండీ కూటమి భేటీ నిర్వహించింది. ఎన్డీయే కూటమి భేటీలో చంద్రబాబు, నితీష్ కుమార్ చేసే డిమాండ్లు, వాటిపై మోడీ, షా ద్వయం స్పందన ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ఇండీ కూటమి భావించింది. అనుకున్నట్లుగానే ఎన్డీయే కూటమి భేటీ తర్వాత సమావేశమైన ఇండీ కూటమి నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్ కు తమ ద్వారాలు తెరిచే ఉంటాయని ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఛీఫ్ మల్లిఖార్జున ఖర్గే ప్రకటన చేశారు.
అయితే ఎన్డీయే కూటమి భేటీలో పాల్గొని వారికే తమ మద్దతు అని స్పష్టంగా చెప్పేసిన చంద్రబాబు, నితీశ్ లు తిరిగి తమ కూటమివైపు మొగ్గుతారని ఇండీ కూటమి ఎందుకు భావిస్తోందనే ప్రశ్నకు వీరిద్దరే తిరిగి సమాధానం చెప్పేలా ఉన్నారు. ఎందుకంటే లోక్ సభ స్పీకర్ పదవి కోసం చంద్రబాబు, నితీష్ ఇద్దరూ పట్టుబడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఇచ్చి, ఎవరిని కాదన్నా తర్వాత తమ పార్టీలను బీజేపీ చీలుస్తుందన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి.
అంతే కాదు కేంద్రమంత్రి పదవుల విషయంలోనూ వీరిద్దరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఈసారి కేంద్రమంత్రి పదవుల పంపకాల్లోనూ చంద్రబాబు, నితీష్ ను సంతృప్తి పరచాల్సిన పరిస్ధితి ఎన్డీయేది. అలాగే తమ పార్టీల్ని చీల్చబోమన్న హామీ కోసం కూడా వీరిద్దరూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నితీష్ లో ఇద్దరూ లేదా కనీసం ఒక్కరైనా తమవైపు వస్తారని ఇండీ కూటమి ధీమాగా ఉంది. ఇది గమనించిన మోడీ, షా ద్వయం ప్రమాణస్వీకారం తర్వాత చూద్దామని అసలు విషయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications