సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్యను ‘లవ్ జిహాద్’ అని ఎందుకు అంటున్నారు?
'అలీబాబా’ అనే టీవీ కార్యక్రమంతో పేరు దక్కించుకున్న టీవీ నటి తునీషా శర్మ, శనివారం ఓ టీవీ షూటింగ్ సెట్లో శవంగా కనిపించారు.
ఆమె మరణం తర్వాత దీని గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
పోలీసులు తొలుత ఆమె ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తునీషా శర్మ ఆత్మహత్యకు సహనటుడు షీజన్ ఖాన్ కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.
ఆమె మరణంపై సినీ, టీవీ రంగానికి చెందినవారంతా సంతాపం వ్యక్తం చేస్తుండగా, మహారాష్ట్ర మంత్రితో సహా అనేక మంది రాజకీయ నాయకులు ఆమె మృతిని 'లవ్ జిహాద్’గా అభివర్ణిస్తున్నారు.
ఛండీగఢ్లో జన్మించిన తునీషా శర్మ, 14 ఏళ్ల వయస్సులోనే నటించడం మొదలుపెట్టారు. ప్రముఖ టీవీ సీరియల్ 'భారత్ కా వీర్ పుత్ర- మహారాణా ప్రతాప్’లో ఆమె నటించారు.
దాని తర్వాత 'చక్రవర్తి అశోక్ సామ్రాట్’, 'ఇష్క్ సుభాన్ అల్లా’, 'ఇంటర్నెట్ వాలా లవ్’ వంటి సీరియళ్లలో కూడా తునీషా నటించారు.
2016లో 'ఫితూర్’ సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ చిన్ననాటి పాత్రలో ఆమె నటించారు.
- చలపతి రావు ఇక లేరు... మూడు తరాల కథానాయకులతో నటించిన వైవిధ్య నటుడు
- 18 పేజెస్ రివ్యూ: ఈ తరానికి సుకుమార్ రాసిన ప్రేమలేఖ
తునీషా తల్లి తీవ్ర ఆరోపణలు
తునీషా తల్లి వనితా శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు, తునీషా సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
తన కూతురి మరణానికి ఆమె సహనటుడు షీజన్ ఖాన్ కారణమంటూ వనితా శర్మ ఆరోపించారు.
''తునీషాను షీజన్ మోసం చేశాడు. మొదట ఆమెతో సంబంధం ఏర్పరచుకొని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు.
అతనికి తునీషా కంటే ముందే మరో అమ్మాయితో సంబంధం ఉంది. మూడు, నాలుగు నెలలు తునీషాను వాడుకున్నాడు. షీజన్కు శిక్ష పడాలి. ఇదే నేను చెప్పదల్చుకున్నా’’ అని ఒక వీడియో సందేశంలో వనితా శర్మ ఆరోపణలు చేశారు.
ఈ దారుణం జరగడానికి ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 23న తాను స్వయంగా సీరియల్ సెట్కు వెళ్లినట్లు వనితా శర్మ చెప్పారు.
'నాకు షీజన్ కావాలి. తిరిగి అతను నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నా. కానీ, అతను ఏమీ వినడానికి సిద్ధంగా లేడు’ అని తనతో తన కుమార్తె తునీషా చెప్పినట్లు వనిత తెలిపారు.
- ధమాకా రివ్యూ: రవితేజ మార్క్ ఉందా? రిమార్క్గా మిగిలిపోయిందా?
- కైకాల సత్యనారాయణ: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోలతో పోరాడిన విలన్
హత్యా? ఆత్మహత్యా?
షూటింగ్ బ్రేక్ సమయంలో తన మేకప్ రూమ్లోకి వెళ్లిన తునీషా శర్మ, షూటింగ్ స్పాట్కి మళ్లీ తిరిగి రాలేదని శనివారం పోలీసులు తెలిపారు.
''తర్వాత కొంతమంది ఆమెను పిలిచేందుకు వెళ్లినప్పుడు, ఎంతకీ ఆమె తలుపు తెరవలేదు. బలవంతంగా తలుపు తెరిచి చూసినప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకొని కనిపించారు’’ అని పోలీసులు చెప్పారు.
ఆదివారం విలేఖరుల సమావేశంలో ఏసీపీ చంద్రకాంత్ జాధవ్ మాట్లాడుతూ, ''పోస్ట్ మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
బ్రేకప్ కారణంగా తునీషా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. బ్రేకప్ గురించి తల్లికి కూడా తునీషా చెప్పారు.
ఆ అబ్బాయి తనతో మాట్లాడటం లేదని, తనతో రిలేషన్కు అతను సుముఖంగా లేడనే సంగతి కూడా ఆమె తన తల్లికి తెలిపారు. ఈ కారణంగానే ఆమె టెన్షన్ పడ్డారు’’ అని ఆయన వివరించారు.
ముఖ్యమైన సమాచారం
- మానసిక సమస్యలను మందులు, థెరపీ చికిత్సలతో నయం చేయవచ్చు. దీని కోసం మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. ఈ కింది హెల్ప్లైన్లను కూడా మీరు సంప్రదించవచ్చు.
- సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్: 1800 599 0019 (13 భాషల్లో అందుబాటులో ఉంది)
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ హెల్ప్ లైన్: 98683 96824, 98683 96841, 011-24131212
- హిత్గుజ్ హెల్ప్లైన్, ముంబై: 022-24131212
- జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్: 080-26995000
పోలీస్ కస్టడీలో షీజన్ ఖాన్
షీజన్ఖాన్పై ఆత్మహత్యకు పురికొల్పడం అనే అభియోగాలతో ఐపీసీ సెక్షన్ 306 కింద థాణె జిల్లాలోని వాలీస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు చెప్పినదాని ప్రకారం, తునీషా శర్మ ప్రియుడు షీజన్ ఖాన్కు కోర్టు నాలుగు రోజుల రిమాండ్ విధించింది. అయితే, పోలీసులు అతనికి ఏడు రోజుల రిమాండ్ విధించాలని డిమాండ్ చేశారు.
షీజన్ ఖాన్ కూడా తునీషా శర్మతో పాటు 'అలీబాబా దాస్తాన్-ఎ-కాబుల్’ అనే టీవీ షో కోసం పనిచేస్తున్నారు. ఈ షూటింగ్ సెట్లోనే తునీషా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తునీషా ఈ టీవీ కార్యక్రమంలో యువరాణి మరియం పాత్రను పోషిస్తున్నారు.
''పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. షీజన్ మీద వారు అభియోగాలు మోపారు. తదుపరి విచారణ ఇంకా జరగాల్సి ఉంది’’ అని షీజన్ ఖాన్ లాయర్ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
ఈ విషయంలో షీజన్ ఖాన్ ఇద్దరు సోదరిలు షఫఖ్ నాజ్, ఫలక్ నాజ్, వారి కుటుంబ సభ్యులు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
ఈ అంశంపై వివరణ కోసం తమను సంప్రదించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రతీ ఒక్కరూ దయచేసి ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ కుటుంబ ప్రైవసీని గౌరవించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
''మీడియా వారు మాకు నిరంతరంగా ఫోన్లు చేస్తున్నారు. మా అపార్ట్మెంట్ కింద నిల్చొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. భారత న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముంబై పోలీసులకు షీజన్ పూర్తిగా సహకరిస్తున్నాడు. ఈ విషయంపై సరైన సమయం వచ్చినప్పుడు మేం మాట్లాడతాం’’ అని అందులో పేర్కొన్నారు.
- 'ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను 'వల్గర్’ అన్న ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ చైర్మన్, ఎవరు ఎలా స్పందించారు?
- 'ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ: సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ
'లవ్ జిహాద్’
ఎఫ్ఐఆర్ ప్రకారం... తునీషా, షీజన్ ఖాన్ రిలేషన్షిప్లో ఉన్నారు. 15 రోజుల క్రితమే వారికి బ్రేకప్ అయింది.
మరోవైపు తునీషా మృతిని 'లవ్ జిహాద్’ కేసు అని మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి గిరీశ్ మహాజన్ అభివర్ణించారు.
పోలీసుల ఈ కేసును విచారిస్తున్నారని, రోజురోజుకీ ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిపోతుందని, వీటిపై కఠిన చట్టాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు.
బీజేపీ నేత రామ్ కదమ్ కూడా మాట్లాడుతూ, ''తునీషా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇది లవ్ జిహాద్ కేసు అయితే దానిపై దర్యాప్తు జరుపుతాం. ఈ కేసులోకి కుట్రదారులను కూడా విచారిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణలో లవ్ జిహాద్ కోణం ఏదీ కనిపించలేదని తునీషా కేసును విచారిస్తోన్న ఏసీపీ చంద్రకాంత్ జాధవ్ తెలిపారు.
ఆర్టిస్టులు ఏమంటున్నారు?
నటి కామ్య పంజాబీ తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు.
''ఈ తరానికి ఏమైంది? మీ సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించుకోవడం కోసం కాస్త ధైర్యంగా ఉండండి. జీవితంపై ఇంత తొందరగా ఎందుకు ఆశలు వదిలేస్తున్నారు? ఎందుకు ఇంత బలహీనంగా మారుతున్నారు? ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేముందు ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వారికి కూడా కొంచెం ప్రాధాన్యతను ఇవ్వండి’’ అని ఆమె ట్వీట్లో రాసుకొచ్చారు.
https://twitter.com/iamkamyapunjabi/status/1606747572051546113
కరణ్ కుంద్రా ట్వీట్ చేస్తూ, ''ఈ ఘటన చాలా షాకింగ్, విచారకరం. యువ నటి చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్నా ప్రార్థిస్తున్నా. ప్రతీ చీకటి రోజు తర్వాత వెలుగు వస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నా’’ అని అన్నారు.
https://twitter.com/kkundrra/status/1606669123467218945
షీజన్ గురించి తునీషా ఏం రాశారు?
తునీషా శర్మకు ఇన్స్టాగ్రామ్లో 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. షీజన్తో కలిసి దిగిన ఫొటోలను తునీషా అనేక సందర్భాల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా షీజన్ ఖాన్ తనను ఎత్తుకున్న ఫొటోను తునీషా షేర్ చేశారు.
''నన్ను ఇలా ఎత్తుకున్న వ్యక్తికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. నా జీవితంలో నేను చూసిన అత్యంత అందమైన, కష్టపడి పని చేసే, ఉత్సాహవంతుడైన వ్యక్తి షీజన్. మీరు ఎంత అద్భుతమైన వ్యక్తి అనేది మీకు తెలియదు షీజన్.
కుటుంబానికి, సమాజానికి పురుషులు చేసే త్యాగాన్ని, సేవను గుర్తించాల్సి సమయం ఇది. పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు’’ అని తునీషా ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.
https://www.instagram.com/p/ClJTkknPWxD/?hl=en
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)