సీడబ్ల్యూసీ సమావేశానికి కమల్నాథ్ డుమ్మా ? కారణమిదేనా ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశానికి మధ్యప్రదేశ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ డుమ్మా కొట్టారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత జరుగుతున్న సమావేశానికి కమల్ నాథ్ హాజరుకాకపోవడం చర్చానీయాంశమైంది. ఇంతకీ కమల్ నాథ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఏం జరిగింది ?
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఏం జరిగింది. లోపమెక్కడ ఉంది. సంస్థాగతంలో ఇంకేమైనా మార్పులు చేయాలా అనే అంశంపై సీడబ్ల్యూసీ చర్చిస్తోంది. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్షతన వహిస్తారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే తదితర సీనియర్ నేతలు హజరయ్యారు. కాంగ్రెస్ పాలిట సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరి సీఎం నారాయణ స్వామి కూడా ఆశీనులయ్యారు. కానీ కమల్ నాథ్ జాడ మాత్రం కనిపించలేదు.
కారణమిది ?
గాంధీ-నెహ్రూ కుటుంబాలకు అత్యంత విశ్వసనీయమైన కమల్ నాథ్ .. సీడబ్ల్యూసీ సభ్యుడు, సోనియా, రాహుల్ లకు విధేయుడు. వాస్తవానికి ఆయన తప్పనిసరిగా సీడబ్ల్యూసీ సమావేశానికి రావాలి. కానీ మధ్యప్రదేశ్ రాజకీయాలు రంజుమీద ఉన్నాయి. ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోంది. ఫలితాల తర్వాత వెంటనే కాంగ్రెస్ కు మెజార్టీ లేదని గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు లేఖ రాసింది. రాష్ట్రంలో తమకు మెజార్టీ ఉందని .. బలనిరూపణకు సిద్ధమని కమల్ నాథ్ బీరాలు పలికారు. అయితే ఈ క్రమంలో ఢిల్లీ వెళ్తే రాష్ట్రంలో పరిస్థితులు ఏమైనా తారుమారవుతాయని అంతర్మథనం నెలకొంది. దీంతోనే ఢిల్లీ పర్యటన విరమించుకున్నట్టు తెలుస్తోంది.
బీ అలర్ట్
బీజేపీ నేతల మాటలకు కమల్ ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉంది. తాము మెజార్టీ రెండు సీట్ల దూరంలో ఉండగా .. బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు రావాలని కోరారు. దీంతో తమ మెజార్టీ నిరూపించుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన .. సభలో బలనిరూపణకు తాము సిద్ధంగా ఉండాలని కమల్ నాథ్ వ్యుహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకాలేదని పరిస్థితిని బట్టి అర్థమవుతుంది.
కాపాడుకునేందుకు పాట్లు ...
ఎన్డీఏ కూటమి మళ్లీ గెలిచి అధికారం చేపట్టబోతోంది. ఈ క్రమంలో తమ అధిపత్యంలో లేని రాష్ట్రాలపై కమలదళం ఫోకస్ చేస్తోంది. ఇందులో ముందువరుసలో మధ్యప్రదేశ్, కర్ణాటక ఉంటాయి. ఇప్పటికే బీజేపీ సంకేతాలు ఇవ్వడంతో .. మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ నాథ్ భావిస్తున్నారు. అందుకోసం ఆదివారం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఈ భేటీకి ఏ నేతైనా రాకుంటే కాంగ్రెస్ పార్టీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు సీట్ల దూరంలో ఉన్న తమకు .. మరింత మంది ఎమ్మెల్యేలు దూరమైతే ఏంటి అనే ప్రశ్న కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నేతల మదిని తొలచివేస్తోంది. అందుకోసమే కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా మధ్యప్రదేశ్ సర్కార్ పై ప్రత్యేక దృష్టిసారించారు.