రోజంతా హడావుడి, రాత్రంతా..: శశికళ 'అనారోగ్యం' వ్యూహం వెనుక..
తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. దాదాపు పది రోజుల కిందట ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు.
చెన్నై: తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. దాదాపు పది రోజుల కిందట ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రతిపాదించగా శశికళను అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఆ తర్వాత తమిళనాడులో.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ తర్వాత, అమ్మ ఆత్మ తనను నడిపించిందంటూ చెన్నై మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు వెళ్ళి శశికళపై తిరుగుబావుటా ఎగురవేశారు.
ఆ వెంటనే తన రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు అన్నాడీఎంకే శ్రేణుల శశికళ. అప్పటికప్పుడు రెండు మూడు బస్సులు ఏర్పాటు చేసి తన వర్గం ఎమ్మెల్యేలను తొలుత చెన్నై విమానాశ్రయం వద్ద ఉన్న ఓ హొటల్కు, ఆ తర్వాత చెన్నై నగరానికి 80 కి.మీ. దూరాన మహాబలిపురం వద్ద ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్కు వారిని తరలించారు.
వారం రోజులు రిసార్టులో..
ఏడెనిమిది రోజులు ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నారు. రోజుకు రెండు మూడుసార్లు 80 కి.మీ. దూరాన ఉన్న ఆ రిసార్ట్స్కు వెళుతూ వస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో జయలలిత సమాధి వద్దకు కూడా వెళుతూ హడావుడి చేశారు.
నీరసం కూడా లేదు
ఈ క్రమంలో ఎక్కడా నీరసం ఛాయలు కనిపించలేదు. కానీ హఠాత్తుగా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మాత్రం ఆమె తనకు అనారోగ్యం కారణంగా నాలుగు వారాల గడువు కోరాలని భావించారు. దీంతో నెటిజన్లు, వ్యతిరేకులు శశికళపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రాత్రంతా రిసార్టులో మంతనాలు
ఆమెకు ఉన్నట్టుండి అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటున్నారు. శశికళకు సుప్రీం జైలుశిక్ష ఖరారు చెయ్యడానికి ముందు రోజు రాత్రి ఆమె రిసార్ట్స్లోనే బసచేసి రాత్రంతా మంతనాలు జరిపారు.
నాలుగు వారాల సమయం ఎందుకు?
శిక్షపడిన రోజంతా కూడా అక్కడే ఉండి చర్చలపై చర్చలు జరిపారు. జయలలిత జీవించి ఉండగా ఆమెతో నెలల తరబడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అక్రమాస్తుల కేసులో తీర్పు రావడానికి ముందంతా ఊహించనంతటి చురుకుగా వ్యవహరిస్తూ మంత్రాంగం నడుపుతూ వచ్చిన శశికళకు జైలు మాట ఎత్తేసరికి ఉన్నట్టుండి ఏకంగా నాలుగు వారాల సమయం కోరాల్సి వచ్చినంత అనారోగ్యం ఏమి వచ్చిందంటున్నారు.
చిన్నమ్మ శపథం
ఈ రోజు కూడా శశికళ బెంగళూరు జైలుకు వెళుతూ జయ సమాధి వద్ద ఆగి మూడుసార్లు సమాధిపై కొడుతూ శపథం చేశారు. ఆమెలో అనారోగ్య లక్షణాలు కనిపించడం లేదని, కానీ ఆమె అనారోగ్యం అని చెప్పడం ఏమిటని అంటున్నారు.
అందుకేనా...
తనకు కోర్టు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో.. వీలైనంత సమయాన్ని దక్కించుకుని తమిళనాడును కలవరపరచడానికే ఆమె ఈ నాటకానికి తెరలేపారనే వాదనలు వినిపిస్తున్నాయి. శశికళ ఇంతటితో ఆగక తనకు జైలులో అవీఇవీ కావాలంటూ పలు డిమాండ్లు కూడా చేయడం విస్మయానికి గురిచేస్తోంది.