జయ ఆస్తుల కేసు: 18 ఏళ్లు ఎందుకు పట్టింది?
చెన్నై: తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడియంకె చీఫ్ జయలలిత అక్రమాస్తుల కేసులో విచారణ పూర్తయి, తీర్పు వెలువడానికి 18 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. తమిళనాడులో విచారణ జరిగితే అది సవ్యంగా జరగదని అంటూ వేరే రాష్ట్రంలో విచారణ జరపాలని డిఎంకె పట్టుబట్టింది. ఇందుకుగాను డిఎంకె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కేసు కొలిక్కి రావడానికి ఇంత సమయం పట్టడానికి అది కారణమని భావిస్తు్ినారు.
డిఎంకె విజ్ఞప్తితో సుప్రీంకోర్టు కేసును బెంగళూర్లో విచారించడానికి అనుమతి ఇచ్చింది. నిందితులు కూడా లెక్కకు మిక్కిలి పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు కేసు ముగింపు దశకు వచ్చేస్తుందని అనుకున్న సమయంలో ముఖ్యమంత్రికి ఏకంగా కోర్టు 1339 ప్రశ్లను సంధించారు. ఇవి కూడా ఆలస్యానికి కారణమయ్యాయి.
ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి జయలలిత నాలుగు సెషన్స్, రెండు నెలలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆమె అంత సమయం తీసుకున్నారు. కేసును బెంగళూర్ కోర్టుకు బదలాయించడానికే ఆరేళ్ల సమయం పట్టింది. 76 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు. వారిలో 64 మంది సాక్షులు ప్రాసిక్యూషన్కు ఎదురు తిరిగారు. తమతో బలవంతంగా సాక్ష్యాలు చెప్పించారని ఆరోపించారు. ఈ 18 ఏళ్ల కాలంలో జయలలిత రెండు సార్లు కోర్టుకు హాజరయ్యారు.
ప్రాసిక్యూషన్ నిందితులతో చేతులు కలిపిందని ఓ సందర్భంలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. లండన్ హోటల్స్ కేసును, జయలలిత అక్రమాస్తుల కేసుతో జోడించేందుకు ఒక సందర్భంగాలో ప్రాసిక్యూషన్ సిద్ధపడింది. ఇదే జరిగితే కేసు విచారణకు మరింత సమయం పట్టి ఉండేది. అయితే, లండన్ హోటల్స్ కేసును ప్రాసిక్యూషన్ స్వచ్ఛందంగా ఉపసహరించుకుంది.