ఎస్ ఇది నిజం: హార్దిక్ తేల్చేశారు.. హామీ ఇవ్వకముందే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరోక్ష మద్దతు
అహ్మదాబాద్: వచ్చేనెలలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ తన వైఖరేమిటో కుండబద్ధలు కొట్టారు. రిజర్వేషన్ కోటాపై కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనే లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సాగనంపాలని పాటిదార్లకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు పటేళ్లకు ఓబీసీ హోదా కల్పించే విషయమై ఎటువంటి హామీ రాకుండానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయారని విమర్శలు కొని తెచ్చుకున్నారు.
Recommended Video

ఆ వెంటనే హార్దిక్ పటేల్ అమ్ముడు పోయారని ఆరు పాటిదార్ల సంఘాలు దుమ్మెత్తిపోశాయి. 2015లో ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పాటిదార్లు ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు.

ఒక వార్తా చానెల్ ఇంటర్వ్యూలో ఇలా హార్దిక్
గురువారం ఆయన సౌరాష్ట్ర రీజియన్లో సుడిగాలి పర్యటన చేసిన హార్దిక్ పటేల్ ఒక వార్తా చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి సాగనంపాలని నా సామాజిక వర్గం ప్రజలకు పిలుపునిచ్చాను. బీజేపీ ఓడిపోవడానికే నా సామాజిక వర్గం ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది' అని చెప్పారు.

ఓటెవరికి వేయాలో ప్రజలకు తెలుసని వ్యాఖ్య
ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నారా? అని ప్రశ్నిస్తే హార్దిక్ పటేల్ స్పందిస్తూ ‘ప్రజలు చాలా తెలివైన వారు. ఎప్పుడు నేను బీజేపీని ఓడించాలని వారికి చెప్పానో.. ఓటెవరికి వేయాలో వారికి తెలుసు' అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను అమ్ముడుపోయానని ఇతర పటేల్ సంఘాలు చేసిన ఆరోపణలను హార్దిక్ పటేల్ తిరస్కరించారు. వారు పాటిదార్లకు నిజమైన ప్రతినిధులు కాదని అన్నారు. వారు బీజేపీ ఆసరాతో ఇలా ఆరోపణలు చేస్తున్నారని కొట్టి పారేశారు. ఏళ్ల తరబడి బీజేపీకి మద్దతునిచ్చిన పాటిదార్లకు ద్రోహం చేసిందని నిందించారు.

భారీగా తరలి వస్తున్న పాటిదార్ యువత
పటేళ్ల రిజర్వేషన్ల కోటా అమలు చేయడంలో మౌనం వహిస్తూ తమ సామాజిక వర్గానికి బీజేపీ ద్రోహం చేసిందని మండి పడ్డారు. రెండేళ్లుగా ఓబీసీ కోటాలో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తున్న యువ నాయకుడు హార్దిక్ పటేల్ నిర్వహించిన భారీ ప్రదర్శనలకు పటేళ్లు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

పల్లెపల్లెనా పుష్పాంజులు ఇలా
వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాటిదార్లను సమాయత్త పరిచేందుకు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న హార్దిక్ పటేల్కు పాటిదార్లు నీరాజనాలు పలుకుతున్నారు. పల్లెపల్లెనా పూలు చల్లుతూ.. మంగళ హారతులు ఇస్తూ స్వాగతం పలుకుతున్నారు. కానీ బీజేపీని సాగనంపాలని, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న హార్దిక్ పటేల్ నిర్ణయానికి కారణం ఆయన లొంగి పోవడమేనని కనీసం ఆరు పటేల్ సంస్థలు తప్పుపడుతున్నాయి. తమ రిజర్వేషన్ల పోరాటానికి రాజకీయం ముసుగేసిన హార్దిక్ పటేల్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించాయి.

హార్దిక్ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్య
'పాటిదార్లను, వారి ఆందోళనను హార్దిక్ పటేల్ తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు ఓబీసీల్లో పటేళ్లకు ఎటువంటి రిజర్వేషన్ కోటా లభించదని ఇప్పుడు అంగీకరించారు. ఆయనకు ఎంతోకాలం రిజర్వేషన్లపై ఆసక్తి లేదు. కానీ కేవలం రాజకీయాలు చేస్తున్నారు' అని ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలోని సంయుక్త పాటిదార్ల కమిటీ సమన్వయకర్త సీకే పటేల్ ఆరోపించారు.

రాజ్యాంగ సవరణతో ఈబీసీ కోటా కల్పిస్తామని హామీ
గుజరాత్ రాష్ట్రంలో ఓబీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. 40 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)కు చెందిన ఏక్తా మంచ్ నాయకుడు అల్పేశ్ ఠాకూర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అగ్రకులాలకు చెందిన పటేళ్లకు రిజర్వేషన్ లబ్ది చేకూర్చేందుకు ఓబీసీలు వ్యతిరేకిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ అధికారంలోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) కింద రాజ్యాంగ సవరణ ద్వారా పటేళ్లకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, హామీ ఇస్తోంది. ఇదే ప్రతిపాదనను బీజేపీ ఇచ్చినా హార్దిక్ పటేల్ తిరస్కరించారు.

కాంగ్రెస్ పార్టీ ఆఫర్కు జిగ్నేశ్ మేవానీ నో
పాటిదార్ల రిజర్వేషన్ల అంశంపై హార్దిక్ పటేల్ సారథ్యంలో ‘పాస్' ప్రతినిధి బృందంతో చర్చలు జరిపేందుకు సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ వచ్చే వారం గుజరాత్ రానున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అల్పేశ్ ఠాకూర్ను అక్కున చేర్చుకున్నది. అయితే దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించారు. వచ్చేనెల 9, 14 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 18వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

మాధవ్ సింగ్ సోలంకి సారథ్యంలో ఇదీ కాంగ్రెస్ పార్టీ రికార్డు
22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు 150 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. 1990కి ముందు మాధవ్ సింగ్ సోలంకి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 149 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ రికార్డును మళ్లీ ఏ పార్టీ అధిగమించలేదు మరి.












Click it and Unblock the Notifications