రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: విపక్షాలు మోడీ గేమ్ప్లాన్ ముందు నిలుస్తాయా..?
Recommended Video
మోడీకి వ్యతిరేకంగా మరో సారి బీజేపీయేతర పార్టీలు జతకట్టబోతున్నాయా...? త్వరలో జరగబోయే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికపై మోడీకి షాక్ ఇచ్చేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మెన్ సేవలందించి ఆ తర్వాత పదవీ విరమణ చేశారు కురియన్.
దీంతో ఆ స్థానం భర్తీకి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే రాజ్యసభలో బీజేపీకి సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తమ మిత్రపక్ష పార్టీల నుంచి ఒక అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేసే యోచనలో ఉంది. అకాలీదల్ పార్టీకి చెందిన నరేష్ గుజ్రాల్ పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. ఆయన పేరును ప్రతిపాదిస్తే బీజేడీ కూడా మద్దతు ఇస్తుందనే ఆశాభావం బీజేపీ వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల్లో రాజ్యసభ సభ్యుల్లో టాప్ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు 13 మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ బీజేడీలు కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇస్తారా అనేదానిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది.కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. విపక్షాలు ప్రతిపాదించిన అభ్యర్థికే కాంగ్రెస్ మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే అన్ని పార్టీలతో చర్చించాకే తమ నిర్ణయం తెలుపుతామని కాంగ్రెస్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఎలాంటి... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్కు ఎలాంటి ఎన్నిక లేకుండా అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక అభ్యర్థికి ఆమోదం తెలిపి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని బీజేపీతో పాటు విపక్షాలకు కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 22 ఏళ్ల క్రితం అంటే 1996లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవికోసం చివరిసారిగా ఎన్నిక జరిగింది.
రాజ్యసభలో ఏయే పార్టీలకు ఎన్ని సీట్లున్నాయి
రాజ్యసభలో మొత్తం సీట్లు 245. అయితే అభ్యర్థి విజయం సాధించేందుకు కావాల్సింది 122 ఓట్లు. అయితే 67 సీట్లతో బీజేపీ రాజ్యసభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఇతర మిత్రపక్షాలు 14 మంది అన్నాడీఎంకే ఎంపీలతో కలిపి బీజేపీకి 104 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇక విపక్షాల విషయానికొస్తే మొన్నటి వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇప్పుడు గుడ్ బై చెప్పేసింది. దీంతో వీరి మద్దతు విపక్షపార్టీలకే ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ మద్దతుతో విపక్షాల బలం 115కు చేరుకుంది. ఇందులో కాంగ్రెస్ వాటా 51గా ఉంది. అయితే అంతిమంగా నిర్ణయించేది మాత్రం 9 మంది సభ్యులున్న బీజేడీ, 6 మంది సభ్యులున్న టీఆర్ఎస్, ఇద్దరు సభ్యులున్న వైసీపీ. వీరు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవిని అలంకరిస్తారు.బీజేడీ పార్టీ మాత్రం ఇటు అధికార బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలతో సమాన దూరం మెయింటెయిన్ చేస్తూ వస్తోంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతోంది. మరోవైపు టీఆర్ఎస్, వైసీపీలు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మమత నిర్ణయమే కీలకమా...?
ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, టీడీపీ, టీఆర్ఎస్లు కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు తెలిపేదిలేదంటూ సంకేతాలు పంపాయి. విపక్షాల నుంచి అభ్యర్థులుగా తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్, బీజేడీకి చెందిన నేత ప్రసన్న ఆచార్య పేర్లు వినిపిస్తున్నాయి.అయితే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవిపై ఇంకా తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ ఎంపీ డెరిక్ ఓ బ్రెయిన్ తెలిపారు. ఇదిలా ఉంటే తమ అధినేత్రి మమతా బెనర్జీ ఒక అభ్యర్థిని నామినేట్ చేస్తుందని ఆ తర్వాత టీడీపీలాంటి పార్టీల మద్దతు కోరనుందని డెరిక్ వెల్లడించారు. అంతేకాదు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో ఆమెకు ఉన్న సత్సంబంధాలు మమతా నామినేట్ చేసే అభ్యర్థికే మద్దతు తెలిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. బీజేపీయేతర పార్టీలు ప్రతిపాదించిన అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు సందేశాన్ని పంపారు.
టీఆర్ఎస్, వైసీపీ మద్దతు బీజేపీకేనా...?
ఉపరాష్ట్రపతి కోసం జరిగిన ఎన్నికల్లో ఓటమి రుచిచూసిన కాంగ్రెస్ ఈ సారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవి కోసం ఇతర ప్రాంతీయ పార్టీలు ప్రతిపాదించిన అభ్యర్థి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక 6 మంది సభ్యులున్న టీఆర్ఎస్ పార్టీ మారుతున్న తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీకే మద్దతు తెలిపే అవకాశం ఉంది.
కర్నాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి కేసీఆర డుమ్మా కొట్టి తాను వారితో కలిసి ప్రయాణించేదిలేదన్న పరోక్ష సంకేతాలు పంపారు. అంతేకాదు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సందర్భంలో కూడా ఇతర విపక్షపార్టీ నేతలను కేసీఆర్ కలిసేందుకు విముఖత చూపారు. మరోవైపు రెండు సీట్లు ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా విపక్షాలతో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదు. ఇదిలా ఉంటే టీఎంసీ తమ అభ్యర్థిని ప్రతిపాదిస్తే కమ్యూనిస్టులు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బహిరంగంగానే స్పష్టం చేశారు.
బీజేపీని ఢీ కొట్టే సత్తా ఎన్డీయేతర పార్టీలకు ఉందా..?
ఇదంతా ఒక ఎత్తు అయితే... బీజేపీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. 2019 ఎన్నికలకు ముందు చివరిసారిగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవికి జరుగుతున్న ఎన్నికలు కానుండటంతో అక్కడ తమ అభ్యర్థే కూర్చోవాలన్న గట్టి సంకల్పం బీజేపీకి ఉంది. అయితే పోటీ అనివార్యమైతే ముందుగా విపక్షాల అభ్యర్థి ఓటమే తమకు ముఖ్యమని భావిస్తోంది.ఓ వైపు తమ మిత్రపక్షాల అభ్యర్థినే బలపరుస్తూ మరోవైపు టీఆర్ఎస్, వైసీపీలాంటి పార్టీలకు స్నేహ హస్తం చూపుతోంది. మరోవైపు ఒడిషాలో 2019 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలవనుంది. మరి ఈ సమయంలో బీజేడీ బీజేపీకి సపోర్ట్ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు జూలై 1న జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన అమిత్ షా ... ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్పై విమర్శలు సంధించారు. కేంద్రం నుంచి రూ.4 లక్షల కోట్లు వచ్చినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని నవీన్ పట్నాయక్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.
ఇక ఎన్డీఏయేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండగా జరుగుతున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలకు వీరు ఎలా వ్యవహరిస్తారో కీలకంగా మారనుంది. అందరూ ఒకే అభిప్రాయంతో ఉంటారా లేక ఎవరి అభిప్రాయాలపై వారు నిలుస్తారా అనేది తేలాల్సిఉంది. అంతేకాదు వీరు తీసుకునే నిర్ణయంపైనే ఎంతకాలం కలిసి ఉంటారు, వీరు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా, స్థిరంగా ఉంటారా అనే సంకేతాలు ఓటర్లకు వెళతాయి. అన్నిపార్టీలు కలిసి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ప్రజల్లోకి బీజేపీ ఇప్పటికే బలంగా తీసుకెళుతోంది.
బలమైన నేత నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీని ఢీకొట్టాలంటే ఏకమవుతున్న విపక్షాలు ఏకాభిప్రాయంపై నడవాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది.