మోడీ సొంతగడ్డపై పీకే వ్యూహాలు-కాంగ్రెస్ లోకి నరేష్ పటేల్ ఎంట్రీ- సీఎం అభ్యర్ధిగా ఫోకస్
యూపీ ఎన్నికల్లో ఘనవిజయంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకున్నామని సంబరపడుతున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ సొంతగడ్డ గుజరాత్ లో కాంగ్రెస్ ను గెలిపించి బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని ఆయన యోచిస్తున్నారు. ఇందులో భాగంగా లెవా పాటీదార్ల నేత నరేష్ పటేల్ ను కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారు. అలాగే ఆయన కూడా పీకే లేనిదే కాంగ్రెస్ గెలుపు సాధ్యం కాదని చెప్తున్నారు.

గుజరాత్ పై పీకే దృష్టి
ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలకు ఘనవిజయాలు అందించి సక్సెస్ ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు గుజరాత్ లో మరోసారి తనను తాను నిరూపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా విజయానికి మొహం వాచిన కాంగ్రెస్ పార్టీకి గెలుపు రుచి చూపించేందుకు పీకే భారీ వ్యూహాలే రచిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఎంచుకుంటున్న నేతలు, దారులు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

కాంగ్రెస్ లోకి నరేష్ పటేల్ ఎంట్రీ
గతంలో హార్ధిక్ పటేల్ ను రంగంలోకి దించడం ద్వారా కొంతమేర లబ్ది పొందిన కాంగ్రెస్ పార్టీలోకి ఈసారి లెవా పాటీదార్ల నేత నరేష్ పటేల్ ను తీసుకొచ్చేందుకు పీకే ప్లాన్ రెడీ చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు నరేష్ పెడుతున్న షరతులపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ స్ధూలంగా ఆయన రాక కాంగ్రెస్ కు కొత్త ఊపిరి ఊదడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు నరేష్ పటేల్ కూడా గుజరాత్ కాంగ్రెస్ ఈసారి గెలవాలంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తప్పనిసరిగా భావిస్తున్నారు.

గుజరాత్ సీఎం ఫేస్ నరేష్
గుజరాత్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నరేష్ పటేల్ ను ఫోకస్ చేయాలనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా ఉంది. గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలో ఉన్న పాటీదార్ల సామాజికవర్గ దేవత ఖోడియార్ ఉన్న ఖోడల్డామ్ ట్రస్టుకు ఈయన ఛైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన్ను కాంగ్రెస్ లోకి తీసుకురావడం ద్వారా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని పీకే కోరుకుంటున్నారు. అందుకే నరేష్ పటేల్ ను ఏకంగా వచ్చీ రావడంతోనే సీఎం అభ్యర్ధిగా కూడా ప్రకటించేలా పీకే వ్యూహాలు రచిస్తున్నారు. రాజకీయంగా ప్రభావవంతమైన పాటీదార్ల వర్గం ప్రధానంగా సౌరాష్ట్ర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వీరి ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టేందుకు నరేష్ పటేల్ ఎంట్రీ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ కూడా భావిస్తోంది.












Click it and Unblock the Notifications