దారుణం: మహిళను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నూతన సంవత్సరం రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టిన కారు.. ఆమెను 12 కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె మరణించింది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ మరణానికి కారణమైన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మారుతి సుజికీ బెలానో కారులో ప్రయాణిస్తున్న నిందితుల్లో ఒకరు క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాప్ యజమాని ఉన్నారని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే వీరంతా ఉన్నారని చెప్పారు.

ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుల్తాన్పురిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. కారు స్కూటీని డీకొనడంతో ఆమె కిందపడిపోయింది. ఆమెపైనుంచి కారు వెళ్లిందని.. ఆ తర్వాత కారుకు ఆమె చిక్కుకుంది. అయినా ఆపకుండా కారు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లారు. దీంతో తీవ్రగాయాలపాలైన మహిళ నరకయాతన అనుభవించి ప్రాణాలు వదిలింది.
ఈ ఘటనను గమనించిన కొందరు ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి తెలిపారు. ఆ తర్వాత 4.11 గంటలకు మహిళ మృతదేహం కనిపించిందంటూ మరో కాల్ పోలీసులకు వెళ్లింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతి చెందిన మహిళను అమన్ విహార్ కు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు. ఆమెకు తల్లి, నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు సోదరులు ఉన్నారు. కాగా, ఈ దారుణ ఘటనపై డిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు.












Click it and Unblock the Notifications