27 ఏళ్ల క్రితం అత్యాచారం.. 13 ఏళ్ల వయసులోనే తల్లి.. కొడుకు అడిగిన ఆ ప్రశ్నతో ఇన్నేళ్లకు కేసు...
ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన ఓ అత్యాచార కేసు స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. 27 ఏళ్ల క్రితం తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఘటన జరిగిన ఇంత సుదీర్ఘ కాలం తర్వాత ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనక చాలా ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ఆ అత్యాచార ఘటన కారణంగా ఆమెకు ఓ కొడుకు పుట్టాడు. నిజానికి తను పెరిగి పెద్దయ్యేంత వరకూ అతనికి తల్లితో ఎటువంటి సంబంధం లేదు. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ మళ్లీ కలవడం... ఆ యువకుడు తన తండ్రి ఎవరని తల్లిని ప్రశ్నించడం... ఆమె ఈ కేసు పెట్టడానికి కారణమయ్యాయి.

అసలేం జరిగింది...
ఉత్తరప్రదేశ్లోని ఓ పట్టణంలో 27 ఏళ్ల క్రితం ఓ బాలిక(12) తన సోదరి,బావలతో కలిసి వారి ఇంట్లోనే ఉండేది. తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇదే క్రమంలో స్థానికంగా ఉండే నకీ హాసన్ అనే వ్యక్తి కన్ను బాలికపై పడింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో నకీ హాసన్ లోపలికి చొరబడ్డాడు. బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు.

1994లో 13 ఏళ్ల వయసులో తల్లి...
బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకీ హాసన్ సోదరుడు గుడ్డు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరూ కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఫలితంగా 13 ఏళ్ల వయసులోనే ఆమె గర్భవతి అయింది. 1994లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతో పురిట్లోనే ఆ బాబును వేరేవాళ్లకు ఇచ్చేశారు. తమ స్వగ్రామం ఉదంపూర్కి చెందిన వ్యక్తికి ఆ బిడ్డను అప్పగించారు. అప్పటినుంచి వారి వద్దే అతను పెరుగుతున్నాడు.

కొన్నేళ్లకు వివాహమైనప్పటికీ...
ఆ తర్వాత సోదరి భర్తకు రాంపూర్కు బదిలీ అవడంతో వారితో పాటే ఆ బాలిక కూడా అక్కడికి వెళ్లింది. కొన్నేళ్లకు బాలిక మేజర్ కావడంతో ఆమె సోదరి భర్త ఓ సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేశాడు. అయితే కొన్నాళ్లకు అతనికి అత్యాచార విషయం తెలిసింది. చిన్నతనంలోనే ఆమె అత్యాచారానికి గురైందని తెలిసి అతను ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె రాంపూర్ నుంచి తన స్వగ్రామం ఉదంపూర్కి షిఫ్ట్ అయింది.

తల్లిని చేరిన కొడుకు... ఆ ప్రశ్నతో ఈ కేసు...
అదే ఉదంపూర్లో పెరుగుతున్న ఆమె కొడుకు ఇప్పుడు యుక్త వయసుకొచ్చాడు. ఈ క్రమంలో తన అసలు తల్లి గురించి,తండ్రి గురించి తెలుసుకోవాలనుకున్నాడు. యాధృచ్చికంగా తన తల్లి కూడా ఉదంపూర్కి రావడంతో ఆమెను కలుసుకోగలిగాడు. అయితే తన తండ్రి ఎవరు అని అతను అడిగిన ప్రశ్నకు ఆమె వద్ద సమాధానం లేకపోయింది. దీంతో సర్దార్ గంజ్ పోలీసులను ఆశ్రయించి 27 ఏళ్ల క్రితం తనపై జరిగిన అత్యాచారంపై ఫిర్యాదు చేసింది. డీఎన్ఏ టెస్టు ద్వారా తన కొడుక్కి తండ్రి ఎవరో తేల్చాలని కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న కారణంగా ఆమె కోర్టును ఆశ్రయించారు. త్వరలోనే ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications