సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ !!
ఏపీలోని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని.. అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్తో పాటు, రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందని ఆయన వెల్లడించారు. కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేశారని.. విజయవాడ సీపీ, డీజీపీతో సహా, అందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాగా సాయికృష్ణ ఇంటికి వెళ్లిన జగన్.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి రాజధాని ప్రాంతమైన విజయవాడ నడిబొడ్డున ఈ తరహా ఘటన జరగడం దారుణమని అన్నారు. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం.. డీజీపీ కార్యాలయం, విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉన్నాయన్నారు. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెప్తూ రోదిస్తున్న దృశ్యం చోటు చేసుకుందని.. ప్రతీ ఒక్కరినీ ఒకటే ఆలోచన చేయమని అడుగుతున్నానని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు.. వారు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్కు పోవడానికి కూడా భయపడే పరిస్ధితి నెలకొందని చెప్పారు. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని.. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకువస్తున్నారని చెప్పడానికి నిదర్శనం ఇది అంటూ మండిపడ్డారు. సాయికృష్ణది ఓ ఘటన అయితే క్రాంతికుమార్ అనే మరో పిల్లాడిది ఇంకో ఘటన అని.. అది ఆత్మహత్య ఘటన అంటూ తెలిపారు.
మే 9 నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగితే, 'నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో'.. అంటూ ఈ తల్లిని హేళనగా మాట్లాడిన పరిస్ధితి ఉందన్నారు జగన్. ఆరోజు నుంచి ఈ తల్లి ప్రతీ రోజూ తనకు సమాచారం అందే కొద్దీ, ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అర్దమై అదే పోలీసు స్టేషన్ కు ప్రతీ రోజూ వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధపడుతున్న పరిస్ధితులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు.
జరిగిన ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారని జగన్ చెప్పుకొచ్చారు. దాంతో జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే.. కోర్టు జోక్యం చేసుకుని మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారన్నారు. ఆ సీఐని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమైన పరిస్ధితులు ఈ రాష్ట్రంలో ఉంటే.. ఇలాంటి పోలీసు అధికారులు వీళ్లకు వత్తాసు పలుకుతుంటే, సీఐ దగ్గరి నుంచి, ఏసీపీ దగ్గరి నుంచి, కమిషనర్ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తురుపు చర్యలు చేపట్టి కేవలం సస్పెన్షన్ తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది. ఫుల్ స్టాప్ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది బయటికి రావాలి. అందుకే సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాకుండా న్యాయపోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సార్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications