స్కూల్లో యువతి గ్యాంగ్ రేప్: కిరాకతక దాడి, హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివార్లలో ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు అనంతరం ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసారని అధికారులు గురువారం తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గురువారం వచ్చిన గ్రామానికి సమీపం గ్రామంలోనే ఆ సంఘటన జరగడం గమనార్హం. యువతిపై అత్యాచారం జరిగిందనే అనుమానాన్ని మాత్రమే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆ విషయం తెలుస్తుందని అంటున్నారు.
బుధవారం రాత్రి లక్నో సమీపంలోని మోహన్లాల్ గంజ్లో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమె మర్మాంగాల్లో కత్తులతో దారుణంగా పొడిచారని, ఫలితంగా సంఘటన జరిగిన బాలసింగ్ ఖేడా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అంతా రక్తం కనిపించిందని వారు తెలిపారు. గురువారం మధ్యాహ్నం క్లింటన్ సందర్శించిన జబ్రౌలి గ్రామానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే సంఘటన ప్రాంతం ఉండడం గమనార్హం.
గురువారం ఉదయం స్కూలు తలుపులు తెరిచినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలు ఆవరణ అంతా రక్తం ఉండడం చూసి భయపడతారని భావించిన టీచర్లు వెంటనే అంతా శుభ్రం చేయించి పిల్లలను ఇంటికి పంపించి వేసారు. ఓ వైపు ఈ ఘోరానికి పాల్పడిన వారిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటే మరో వైపు పోలీసు అధికారులు క్లింటన్తో ఫోటోలు దిగడానికి పడ్డారు.
మృతురాలిని ఇంకా గుర్తించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించలేదని ఓ అధికారి చెప్తూ ప్రాథమిక అంచనాను బట్టి కత్తిపోటు గాయాల కారణంగా యువతి మర్మాంగాలనుంచి విపరీతంగా రక్తస్రావం వల్లనే ఆమె చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ సంఘటనపై ప్రధాన ప్రతిపక్షాలైన బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీలు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించాయి.