థర్డ్: ప్రధానిగా జయలలితకే ఛాన్స్? అధినేత్రి ఆదేశాలు
చెన్నై: 2014 సార్వత్రిక ఎన్నికలలో థర్డ్ ఫ్రంట్ తన సత్తా చూపిస్తే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితకే ఎక్కువగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పదకొండు పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి అభ్యర్థి కోసం ఆ ఫ్రంట్లో పోటాపోటీ నెలకొన్నప్పటికి జయలలితకే ఎక్కువగా ఛాన్స్ ఉంది. అయితే, రాష్ట్రంలో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్షం డిఎంకె పార్టీలో రోజు రోజుకు వీక్ అవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని స్థానాలు గెలుచుకోవడం కష్టం కాదని అన్నాడిఎంకె క్యాడర్ ధీమా.
దీంతో రాష్ట్రంలో అన్ని స్థానాలలో రెండాకుల జెండాను(జయలలిత పార్టీ గుర్తు) ఎగురవేయాలని అన్నాడిఎంకె ఉవ్వీళ్లూరుతోంది. 2014 సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలోని 40 స్థానాలలో గెలుపొందే విధంగా వర్క్ చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జయలలిత సూచిస్తున్నారు. ఆమెకు పలు పార్టీల మద్దతు కూడా లభిస్తోంది.
రెండు రోజుల క్రితం జెడి(ఎస్) అధ్యక్షులు దేవేగౌడ మాట్లాడుతూ... ప్రాంతీయ పార్టీలకు దేశాన్నేలే సత్తా ఉందని అన్నారు. లోక్సభ ఎన్నికలలో అన్నాడిఎంకె కూటమి 40 స్థానాలు సాధిస్తే ప్రధాని అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత్రి జయలలితకు మద్దతిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికంగా ఉంటుందని, అందుకే తృతీయ ఫ్రంట్ సాకారమయ్యేలా త్వరలో అన్ని పార్టీల నేతలతో భేటీ అవుతానన్నారు.
వచ్చే ఎన్నికల్లో జయలలితతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్లే కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. అన్నాడిఎంకె క్యాడర్ జయలలితను ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటోంది. బీహార్లో 40, యుపిలో 80 లోకసభ స్థానాలున్నప్పటికీ థర్డ్ ఫ్రంట్లో ఉండబోయే ఎస్పీ, జెడియులు అంతగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. మోడీ హవాతో బిజెపి బీహార్, యుపిలలో సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, లోక్సభ ఎన్నికల్లో 'ఫెడరల్ ఫ్రంట్' (సమాఖ్య కూటమి) ఏర్పాటుకు బిజెపి, కాంగ్రెసేతర పార్టీల నాయకులు సమాయత్తమైన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో 11 పార్టీల నాయకులు సమావేశమై ఉమ్మడి అంశాలపై ఒక అవగాహనకు వచ్చారు. నాలుగు వామపక్షాలు, సమాజ్వాది, అన్నాడిఎంకే, అసోం గణపరిషత్ (ఎజిపి), జార్ఖండ్ వికాస్ మోర్చా, జెడిఎస్, బిజెడి, జెడియు పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.