సీఎం హెలికాప్టర్ గల్లంతంటూ వదంతులు: అధికారుల్లో తీవ్ర టెన్షన్!
అధికారుల మధ్య సమన్వయ లోపంతో హెలికాప్టర్ ల్యాండింగ్ జరగాల్సిన ప్రదేశాన్ని దాటి ముందుకెళ్లిపోయింది.
భువనేశ్వర్: ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో సీఎం నవీన్ పట్నాయక్ పర్యటన ఉత్కంఠను రేపింది. నిర్ణీత సమయానికి ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కాకపోవడం.. సీఎం హెలికాప్టర్ గల్లంతంటూ వదంతులు వ్యాపించడంతో.. ఒడిశా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దానికి తోడు కోరాపుట్ జిల్లా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం కావడంతో జనాల్లో ఆందోళన మరింత పెరిగింది.
అయితే సమన్వయ లోపం కారణంగానే సీఎం హెలికాప్టర్ దాదాపు 45నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. అందువల్లే ల్యాండింగ్ ఆలస్యమై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీఎం హెలికాప్టర్ మిస్సింగ్ అన్న వార్తతో కొద్దిసేపు ఒడిశా అధికారులు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాగా, మధ్యాహ్నాం 12.40గం.లకు ల్యాండ్ కావాల్సిన సీఎం విమానం.. ఆలస్యంగా 1.30గం.లకు ల్యాండయింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో హెలికాప్టర్ ల్యాండింగ్ జరగాల్సిన ప్రదేశాన్ని దాటి ముందుకెళ్లిపోయింది.
విమానం ముందుకెళ్లిపోవడంతో.. అక్కడి ప్రజలు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత దాదాపు 45నిమిషాల పాటు గాల్లోని చక్కర్లు కొట్టి.. చివరికు కోరాపాద్ హెలిప్యాడ్ వద్ద సురక్షితంగా ల్యాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.