మహదాయి నీటి వివాదం: ఇరుకునపడ్డ యడ్యూరప్ప, రైతుల ఆందోళన
Recommended Video
బెంగళూరు/పనాజి: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహదాయి నది నీళ్ల పంపిణీ కర్ణాటక భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే గోవా-కర్ణాటకల మధ్య ఉన్న మహదాయి నీటి వివాదాన్ని పరిష్కరిస్తామని కర్ణాటక బీజేపీ ప్రకటించింది.
గత వారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో గోవా సీఎం మనోహర్ పారికర్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పలతో న్యూఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కర్ణాటక ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోవా.. మహదాయి నుంచి 7టీఎంసీల నీటిని ఇచ్చేందుకు అంగీకరించిందని యడ్యూరప్ప తెలిపారు. అంతేగాక, గోవా నుంచి నీటిని రాబట్టేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ఆ తర్వాతి రోజే ప్రోటోకాల్ను పక్కన పెట్టి.. గోవా సీఎం ఓ లేఖను యడ్యూరప్పకు రాశారు. ముంబై-కర్ణాటక ప్రాంతానికి తాగునీరు అందిస్తామని అందులో పేర్కొన్నారు. కాగా, పారికర్-యడ్యూరప్పల భేటీ ఇటు గోవాలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. మహదాయి నీటిపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని, పారికర్ కర్ణాటకతో మాట్లాడాల్సిన అవసరం ఏంటని గోవా బీజేపీ మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే గోవా ప్రభుత్వం నుంచి కూడా తప్పుకునేందుకు సిద్దమని ఆయన ప్రకటించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తపడ్డ పారికర్.. మహదాయి జల పంపిణీపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో యడ్యూరప్ప ఇరుకునపడినట్లయింది.
అయితే, ఎన్నికల్లో లాభం పొందేందుకే గోవా సీఎం నిబంధనలు పట్టించుకోవడం లేదని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, కర్ణాటకకు ప్రయోజనం జరుగుతుందనే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సిద్ధరామయ్య అన్నారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తనకు కాకుండా గోవా సీఎం.. యడ్యూరప్పకు లేఖ రాయడమేంటని ప్రశ్నించారు.
కాగా, మంగళవారం భారీ ఎత్తున రైతులు ఆందోళనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తమకిచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ఉత్తర కర్ణాటక రైతులు డిమాండ్ చేశారు. రైతులతో యడ్యూరప్ప మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని హామిచ్చారు. కాగా, ముంబై-కర్ణాటక ప్రాంతం 56అసెంబ్లీ స్థానాలు కలిగివుంది. ఇక్కడ మెజార్టీ ప్రజలు లింగాయత్లే కావడం బీజేపీకి కంచుకోటగా మారనుంది. ఏదైనా తేడే చేస్తే మాత్రం లింగాయత్ల నుంచి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. 'నేను మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు పూర్తి నిజాయితీతో ప్రయత్నిస్తున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం నా పై కుట్ర పన్నుతున్నారు. నన్ను కావాలనే ఇబ్బందులకు గురిచేసేలా ప్రయత్నిస్తున్నారు' అని అన్నారు.
డాలర్స్ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసంలో మంగళవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీలు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్తో పాటు పార్టీ రాష్ట్ర నేతలు జగదీష్ శెట్టర్, ప్రహ్లాద్ జోషి, ఆర్.అశోక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమవేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం.
'బీజేపీ-జేడీఎస్ సంయుక్త ప్రభుత్వం ఉన్న సమయంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో కళసా-బండూరి నాలా కార్యక్రమం అమలుకు రూ.100 కోట్లు కేటాయించాను. ఇందుకు అప్పటి సీఎం హెచ్.డి.కుమారస్వామి తీవ్ర అభ్యంతరం తెలియజేసినా నేను అదేమీ పట్టించుకోలేదు. అందుకే ఉత్తర కర్ణాటక ప్రజలు నన్ను అభిమానిస్తారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు(సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ) నా పై కుట్రలు పన్నుతున్నారు. ఇందుకు సొంత ఆర్టీ నేతలే సహకారం అందిస్తున్నారు' యడ్యూరప్ప సంచలన ఆరోపణలు చేశారు. కాగా, బీజేపీ ఇచ్చిన హామి నిలబెట్టుకోవాలంటూ ఉత్తర కర్ణాటక రైతులు బుధవారం కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు.