ఆ సీఎం నోట్లోంచి మాట రావడమే ఆలస్యం.. మంత్రులు, అధికారులు.. ఉరుకులు, పరుగులు
యూపీ సచివాలయంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తరువాత మంత్రులు, అధికారులు.. ఉరుకులు, పరుగులు తీస్తున్నారు.
లక్నో: సమయం: సాయంత్రం 6 గంటలు. స్థలం: లక్నోలోని సచివాలయం. లోపలికి తొంగి చూస్తే.. అంతా ఖళీ. ఒక్క ఉద్యోగి కూడా లేరు. సచివాలయం మొత్తం బోసిపోయినట్లు ఉంది. అయితే ఇదంతా ఒకప్పుటి పరిస్థితి.
ఇప్పుడు సీన్ మారింది. యూపీకి కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తరువాత పరిస్థితి వేరుగా ఉంది. ఆయన నోట్లోంచి ఏ క్షణంలో ఏం మాట వస్తుందాని మంత్రులు, అధికారులు కాచుకుని కూర్చుంటున్నారు. ఆయన సైగ చేస్తే చాలు.. ఉరుకులు, పరుగులు తీస్తున్నారు.

సీన్ మారింది...
పెద్ద పెద్ద పదవుల్లో, ఉద్యోగాల్లో ఉండి ఇన్నాళ్లూ విలాసాలకు అలవాటు పడిన వారు ఇప్పుడు ఆయాసపడుతూ అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది. మంత్రులు సైతం నిత్యం తమ శాఖల కార్యదర్శులతో చర్చల్లో మునిగిపోతున్నారు. రోజుకు కనీసం 18-20 గంటలు పనిచేసే వాళ్లే తనకు కావాలని ఇటీవల గోరఖ్ పూర్ లో చెప్పిన మాటలను ఇప్పుడు ఆచరణలో చేసి చూపిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

పొద్దుపోయాక కూడా...
ఇటీవల ఓ రోజు రాత్రి 11 గంటలకు కూడా ముఖ్యమంత్రి యోగి విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు కూడా ఫైళ్లు చంకనబెట్టుకుని అర్థరాత్రైనా అపరాత్రైనా సిద్ధమైపోతున్నారు. ఏప్పుడు ఏం సమాచారం అడుగుతారో తెలియక అన్ని ఫైళ్లూ మోసుకొచ్చుకుంటున్నారు. గతంతో పోల్చితే సమావేశాలు కూడా చాలా ఎక్కువ సేపు జరుగుతున్నాయి.

పొట్టలు కరుగుతున్నాయి...
ఇంతకుముందు మాదిరిగా సాయంత్రం 6 గంటలకే ఇళ్లకు చేరుకుని.. తీరిగ్గా సోఫాల్లో కూలబడి చిరుతిండ్లు తింటూ టీవీ చూడ్డానికి అధికారులకు వీలవడం లేదు. పెంచిన పొట్టలు కూడా కరిగిపోతున్నాయంటూ పోలీసుశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అధికారికి బాధ్యతలు అప్పగిస్తూ, అప్పగించిన పని పూర్తయిందా? లేదా? అని తరచి తరచి చూస్తుండడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు.

అందరికీ నిర్దిష్ట లక్ష్యాలు...
తొలి వంద రోజులకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయిస్తూ, వాటిని పూర్తి చేయడానికి ఏ రకమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తారో చేసి తీసుకురమ్మని ఆదేశిస్తుండడంతో అధికారులు బిక్కముఖం వేస్తున్నారు. అంతేకాకుండా, తొలి వంద రోజుల పాలన పూర్తయిన తరువాత బాగా పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, అలాగే పని ఎగ్గొట్టే వారు, సరైన ఫలితాలు రాబట్టని వారిమీద మాత్రం చర్యలు తప్పవని హెచ్చరిస్తుండడంతో ఆయా శాఖల అధికారులు హడలిపోతున్నారు.

సమీక్షలు, చర్యలు...
ఇంతటితో ఆగుతుందా? అంటే అదీ లేదు. ఆ తరువాత కూడా ఆర్నెల్లకు ఒకసారి, ఏడాది పూర్తయ్యాక మరోసారి అన్ని శాఖలు, అధికారులందరిపై సమీక్షలు ఉంటాయని చెబుతుండడంతో అందరూ గుడ్లు తేలేస్తున్నారు. రాత్రి 11 గంటలకు నిర్వహించిన విద్యాశాఖ సమావేశానికి కేబినెట్ మంత్రి ముకుట్ బిహారీ వర్మను కూడా పిలిపించారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ తీరుతెన్నులు, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలను సీఎం యోగి ఈ సమావేశంలో చర్చించారు. వంద రోజుల్లోగా ఫీజులను ఒక కొలిక్కి తీసుకురావాలంటూ ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు బాధ్యత అప్పగించారు.












Click it and Unblock the Notifications