ప్రధాని మోడీతో యోగి ఆదిత్యనాథ్ భేటీ: యూపీలో ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చ, వరుస భేటీలు
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి అధికారి నిలబెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధిమైంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కూర్పు, ప్రమాణ స్వీకార కార్యక్రమం సహా పలు అంశాలపై ప్రధానితో చర్చించారు.
Recommended Video
సుమారు రెండు గంటలపాటు వీరి భేటి జరిగింది. ఈ సమావేశంపై ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. భవిష్యత్తులో యూపీని సరికొత్త అభివృద్ధి శిఖరాల వైపు యోగి ఆదిత్యనాథ్ నడిపిస్తారని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలను కూడా కలుస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణమంత్రి రాజ్నాథ్లతో కూడా సమావేశం అయ్యారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోశ్తో కూడా యోగి భేటీ అయ్యారు. ప్రమాణస్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా, సోమవారం కూడా యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటన కొనసాగనున్నట్లు సమాచారం.
ఇది ఇలావుండగా, యూపీలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. సాధారణ మెజార్టీకి 202 స్తానాలు అవసరం. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో 273 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో కమలం పార్టీకి తిరుగులేని విజయం లభించింది. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ 125 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి.