యూపీలో దారుణం-ఇంట్లో నమాజ్ కోసం గుమికూడారంటూ 26 మందిపై కేసు
యోగీ ఆదిత్యనాథ్ సారధ్యం లోని యూపీ ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తోందంటూ కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. అయితే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా ముస్లింలపై పోలీసు కేసుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా చితకా కారణాలతో ముస్లింలపై యూపీ పోలీసులు నమోదగు చేస్తున్న కేసులు కలకలం రేపుతున్నాయి.
తాజాగా మొరాదాబాద్ లోని ఓ ఇంట్లో నమాజ్ కోసం గుమికూడారంటూ 26 మంది ముస్లింలపై యోగీ సర్కార్ పెట్టిన కేసు చర్చనీయాంశమవుతోంది. స్థానిక అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఒక ఇంట్లో నమాజ్ చేయడానికి సామూహికంగా గుమి కూడినందుకు మొరాదాబాద్ పోలీసులు 26 మందిపై కేసు నమోదు చేశారు. మొరాదాబాద్ ఎస్పీ సందీప్ కుమార్ మీనా మాట్లాడుతూ కొద్ది మంది ప్రజలు నమాజ్ కోసం ఇంట్లో గుమిగూడారన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఇద్దరు గ్రామస్తుల ఇంట్లో వీరంతా గుమికూడినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకోకపోవడంతో వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
గతంలో ఇక్కడ గుమికూడి నమాజ్ నిర్వహించడంపై స్ధానికంగా ఉండే ఒకరు ఫిర్యాదు చేశారని, అందుకే పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండా నమాజ్ చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సందీప్ మీనా వెల్లడించారు. స్థానికుడైన చంద్ర పాల్ సింగ్ ఫిర్యాదుపై 16 మంది గుర్తించిన, 10 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ 505-2 (మత ఆరాధనలో నిమగ్నమై ఉన్న సభలో ప్రజా దుష్ప్రవర్తనకు దారితీసేలా వ్యవహరించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
మొరాదాబాద్ లోని దుల్హేపూర్ గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంటి లోపల ప్రార్థనలు చేస్తున్నట్లుగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని తరువాత కొంతమంది బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీంతో మొరాదాబాద్ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంట్లో నమాజ్ చేసుకోవడం కూడా తప్పేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.