సీఎంల డబుల్ రోల్: రాష్ట్రపతి ఎన్నికలు.. జూలై వరకు ఎంపీలుగా
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, గోవా సీఎం మనోహర్ పారికర్లు రానున్న జూలై వరకు రెండు పదవుల్లో కొనసాగనున్నారా? అంటే అవుననే అంటున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, గోవా సీఎం మనోహర్ పారికర్లు రానున్న జూలై వరకు రెండు పదవుల్లో కొనసాగనున్నారా? అంటే అవుననే అంటున్నారు.
ఇటీవల ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక బాధ్యతలు పుచ్చుకున్న బీజేపీ ఎంపీలు ఇప్పట్లో లోకసభకు రాజీనామా చేసే అవకాశాలు కనిపించడం లేదు. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నందున అప్పటి దాకా వారు ఎంపీ పదవిలోనే కొనసాగనున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( గోరఖ్పూర్ ఎంపీ), ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (ఫుల్పూర్) లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గోవా సీఎం మనోహర్ పారికర్ యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.
అయితే యూపీకి మరో ఉపముఖ్యమంత్రి ప్రమాణం చేసిన దినేశ్ శర్మ ఇప్పటికే లక్నో మేయర్ పదవికి రాజీనామా చేశారు. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా... ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసిన ముగ్గురు బీజేపీ నేతలూ ఆరు నెలల్లోగా అంటే సెప్టెంబర్లోగా రాజీనామా చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఓ బీజేపీ సీనియర్ నేత మాట్లాడుతూ... రాష్ట్ర అసెంబ్లీకి వారు ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ఎన్నిక కావొచ్చునని, ఆ తర్వాత 14 రోజుల్లో లోకసభ, రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పారు.
కాబట్టి తొందరేం లేదని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలకు పోయేకంటే తమకు అత్యవసరమైన పనులు ఇంకా చాలానే ఉన్నాయని చెప్పారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విజయం కైవసం చేసుకోవడంతో ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం తమ చేతుల్లోకి వచ్చినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కాగా యూపీ యోగి, మౌర్య ఆ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల కోసం ప్రత్యక్ష ఎన్నికలకైనా వెళ్లొచ్చు. లేదా శాసనమండలి ద్వారా అసెంబ్లీలోకి అడుగు పెట్టవచ్చు.