ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు.. ఎనిమిదో పెళ్లికి రెడీ.. మరో రెండింటికీ ప్లాన్ !
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. కానీ ఓ కిలేడీ మాత్రం.. ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు.. చేసుకొని.. ఎనిమిదో పెళ్లి చేసుకోబోతూ.. మరో రెండు పెళ్లిళ్లకు కూడా ప్లాన్ చేసింది. అంతే కాకుండా ఆమెకు రెండేళ్ల చిన్నారి కూడా ఉండడం ఇక్కడ మరో ట్విస్ట్ అని చెప్పాలి. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అసలు బాగోతం బయటపడింది. ఈ అనూహ్య ఘటన కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్రివాండ్రం జిల్లాలోని ఆర్యనాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల రేష్మా చంద్రశేఖరన్ అనే మహిళ.. ఎనిమిదో వివాహానికి ముందు ఒక బ్యూటీ పార్లర్లో మేకప్ వేయించుకుంటుండగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పొత్తన్కోడ్కు చెందిన ఒక స్థానిక ప్రజా ప్రతినిధితో రేష్మా వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కాబోయే వరుడు.. ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

మ్యాట్రిమోనియల్ ద్వారా పరిచయం..
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా రేష్మాతో పరిచయం ఏర్పడిందని.. ఓ మహిళ ద్వారా మధ్యవర్తిత్వం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొట్టాయంలోని ఒక మాల్లో మొదటిసారి కలిశామని.. అనాథ అని పరిచయం చేసుకుందని తెలిపారు. జూన్ 6న జరగాల్సిన వివాహానికి కూడా తనవైపు నుంచి ఎవరూ లేరని అందుకే పెద్దగా అనుమానం రాలేదని చెప్పాడు. కానీ వివాహానికి ముందు రోజు రేష్మా, కాబోయే వరుడి .. స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆమె ప్రవర్తనను గమనించిన స్నేహితుడి భార్య సైతం అనుమానం వ్యక్తం చేసింది.
బంగారంతో పరారీ..
దీంతో రేష్మా బ్యూటీ పార్లర్కి వచ్చిన సమయంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ను తనిఖీ చేయగా.. గత వివాహాలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వెంటనే పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో వివాహం తంతు ముగిసిన తర్వాత.. వరుడు మంగళసూత్రం కట్టిన తర్వాత కొన్ని రోజులకే ఆమె అదృశ్యమయ్యేదని విచారణలో తేలింది. తర్వాత ఎవరికీ అందుబాటులో ఉండేది కాదని పోలీసులు తెలిపారు.
ఆమె గతంలో వివాహం చేసుకున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. విచారణలో ఆమె మరో రెండు పెళ్లిళ్లు కూడా ప్లాన్ చేసిందని పోలీసులు వివరించారు. ఈ ఘటన కేరళ వ్యాప్తంగా సంచలనం రేపగా.. రేష్మా చంద్రశేఖరన్ మోసాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications