ముంబై దాడులు జరిగిన రోజున కలకలం: ఈ విమానంలో ఉగ్రవాది ఉన్నాడు
విమానంలో ఉగ్రవాది ఉన్నాడు అనే పోస్టు పెట్టినందుకు గాను ఓ యువకుడిని అరెస్టు చేసిన ఘటన కోల్కతాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... కోల్కతా నుంచి ముంబైకి బయలు దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో యోగ్ వేదాన్ పొద్దార్ అనే యువకుడు ప్రయాణించాడు. తన ముఖాన్ని రుమాలుతో కప్పుకుని ఒక ఫోటో తీసుకుని ..."ఈ విమానంలో ఉగ్రవాది ప్రయాణిస్తున్నాడు.. అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు" అనే పోస్టు పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
యోగ్ వేదాన్ పక్కనే కూర్చున్న వ్యక్తి ఇది గమనించాడు. వెంటనే విమానంలోని సిబ్బందికి విషయాన్ని తెలపాడు. విషయం బయటకు పొక్కడంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలే నవంబర్ 26వతేదీన ముంబై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరో విధ్వంసానికి పూనుకున్నారా అనే అనుమానం విమానంలోని ప్రయాణికులకు కలిగింది. విమానంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే విమానం నడిపే పైలట్ లోపల పరిస్థితి గురించి ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి తెలిపాడు. దీంతో విమానం తిరిగి ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఏటీసీ.
విమానం తిరిగి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంకు చేరుకుంది. వెంటనే ఆ యోగ్ వేదాన్ను కిందకు దింపి సీఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించారు. వారు విమానాశ్రయంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. విమాన సిబ్బందికి యోగ్ పెట్టిన పోస్టు గురించి సహప్రయాణికుడు చెప్పిన తర్వాత... సిబ్బంది యోగ్ వేదాన్ను మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరారని అయితే ఫోన్ ఇచ్చేందుకు యోగ్ వేదాన్ నిరాకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని యోగ్ వేదాన్కు ఇంతకుముందు ఏమైన నేరచరిత ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. విషయం తెలుసుకున్న యోగ్వేదాన్ తల్లిదండ్రులు విమానాశ్రయం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. యోగ్ వేదాన్ తన ఫ్రెండ్స్తో పరాచకాలు ఆడే క్రమంలోనే ఈ పోస్టు పెట్టాడని అంతకు మించి మరే ఉద్దేశంతో పోస్టు పెట్టలేదని తల్లిందండ్రులు చెప్పారు. యోగ్ వేదాన్ లగేజీని కూడా దించేసి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు జరిగిన ఘటన కారణంగా విమానం గంట ఆలస్యంగా ముంబైకి బయలుదేరింది.