తోసుకున్నఎంపీలు: సోనియా ఎదుటే..: జతకల్సిన జగన్
న్యూఢిల్లీ: లోకసభలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు బుధవారం తోసుకొని ముష్టిఘాతాలకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మంద జగన్నాథం సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపి శివప్రసాద్ని తోయడంతో ఘర్షణ జరగగా, జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్ వారిని వారించారు.
ఖర్గే ప్రసంగం కొనసాగుతుండగా సీమాంధ్ర ఎంపీలు ఆయన చేతిలోని బడ్జెట్ పేపర్లను తీసుకొని చించి వేసే ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు ఖర్గేకు రక్షణగా నిలబడ్డారు. ఈ సమయంలో శివప్రసాద్, మందాలు తోసుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతుండగా సీమాంధ్ర కేంద్రమంత్రులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఖర్గే రైల్వే బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజులు వెల్లోకి దూసుకొచ్చి సమైక్య నినాదాలు చేశారు. మరో ఇద్దరు సీమాంధ్ర కేంద్రమంత్రులు కిశోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణిలు తమ తమ స్థానాల్లో ఉండి నిరసన తెలిపారు. కేంద్రమంత్రులు సోనియా వారించినా వెల్లోకి దూసుకెళ్లారు. బొత్స ఝాన్సీ కూడా నిరసన తెలిపారు.
వేటు పడిన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితరులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎదుటే ఆందోళన చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు.
మరోవైపు, తాము గురువారం పార్లమెంటులో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనీయమని గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు అన్నారు. రేపు ఇంతకంటే తీవ్రమైన పోరాటం జరుగుతుందన్నారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, అయినప్పటికీ బిల్లును అడ్డుకునేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు. 35 మంది ఎంపీలు రేపు అవిశ్వాస తీర్మానం ఇస్తారని ఆయన తెలిపారు.