వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బస్సు: 15 మంది మృతి
ఇస్లమాబాద్: పొరుగు దేశమైన పాకిస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. నార్త్వెస్ట్ పాకిస్థాన్లో వరదల కారణంగా ఓ పెళ్లి బస్సు కొట్టుకుపోయి 15 మంది చనిపోయారు. వివరాల్లోకి వెళితే... ఆప్గనిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన లండి కోటాల్ ఏజెన్సీ పర్వత ప్రాంతం నుంచి ఓ పెళ్లి బస్సు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వరద ముంచుకు రావడంతో బస్సు కొట్టుకుపోయిందని స్థానిక అధికారి ఇక్బాల్ ఖాన్ తెలిపారు.
శనివారం నాటు చోటు చేసుకున్న ఈ సంఘటనలో బస్సులో కొంత మంది వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారని, మరికొంత మంది గాయాలు పాలయ్యారని తెలిపారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత 15 మంది మృతిదేహాలు మాత్రమే తమకు లభ్యమయ్యాయని పేర్కొన్నారు.
బస్సులో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కూడా ఉన్నారా? అనే దానిపై స్పష్టత లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మందే ఉన్నారని తాము చెప్పలేమని, తమకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని వారు తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. కాగా జులై నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాకిస్థాన్లో ఇప్పటివరకు 55 మంది మరణించినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలతో ముగిసే వర్షాకాల సీజన్లో భాగంగా వరదలు రావడం సహజమేనని అన్నారు.