పెను విషాదం: తీరానికి కొట్టుకొచ్చిన 74మంది మృతదేహాలు
సముద్రంలో మరో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఐరోపాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యధరా సముద్రంలో మునిగిపోయి 74 మంది మృతి చెందారు.
ట్రిపోలీ: సముద్రంలో మరో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఐరోపాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యధరా సముద్రంలో మునిగిపోయి 74 మంది మృతి చెందారు. వారి మృతదేహాలు లిబియా రాజధాని ట్రిపోలీ పశ్చిమ తీరానికి చేరినట్లు రెడ్ క్రెసెంట్ సంస్థ మంగళవారం తెలిపింది.
తీరానికి సమీపాన ఉన్న హార్చా గ్రామానికి చెందిన కొందరు ధ్వంసమైన పడవలో మృతదేహాలను చూసి అత్యవసర సేవా విభాగాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది.
ఈ విషాదానికి సంబంధించిన చిత్రాలను సంస్థ సామాజిక మాధ్యమాల్లో పెట్టింది.

మృతదేహాలను తరలించేందుకు తగిన వాహనం తమవద్ద లేదని.. ఖననం చేసేందుకు అనువైన స్థలం కూడా లేదని పేర్కొంది. ఇంకా కొన్ని మృతదేహాలు తీరంలో ఉండగా.. మరికొన్ని జలాల్లో తేలియాడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
2011 విప్లవం తరువాత కల్లోలిత లిబియా నుంచి మనుషులను అక్రమంగా తరలించడాన్ని కొందరు లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారు. లిబియా పశ్చిమ తీరం నుంచి సముద్రం గుండా ఇటలీకి ఎక్కువగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వలసదారులను అడ్డుకునేందుకు యూరోపియన్ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications